IBM Layoffs: త్వరలో 8వేల మంది ఉద్యోగులు లేఆఫ్.. ఏఐతో షాక్ ఇచ్చిన ఐబీఎం..

IBM Layoffs: త్వరలో 8వేల మంది ఉద్యోగులు లేఆఫ్.. ఏఐతో షాక్ ఇచ్చిన ఐబీఎం..

AI Layoffs: ప్రపంచ వ్యాప్తంగా ఏఐ విస్తరణ, విరివిగా వాడకం పెరిగిపోతున్న వేళ కొన్ని మిలియన్ల మంది ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పెద్దపెద్ద కంపెనీలు సైతం ఏఐతో ఉద్యోగులను భర్తీ చేయటం ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. దీంతో ఖర్చులను తగ్గించుకోవటంతో పాటు పనితీరును పూర్తిగా ఆటోమేట్ చేసి మెరుగుపరచాలని సంస్థలు భావిస్తున్నాయి.

తాజాగా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఐబీఎం రానున్న కాలంలో 8వేల మంది ఉద్యోగులను లేఆఫ్ చేసే ప్రణాళికలో ఉంది. కంపెనీ తన హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మెుత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏఐతో భర్తీ చేయటం ద్వారా చాలా మంది ఉద్యోగులు ప్రభావితం కానున్నట్లు తేలింది. ఇటీవల కంపెనీ సీఈవో అరవింద్ కృష్ణ వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూలో ఏఐ వినియోగం గురించి చేసిన కామెంట్స్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

ALSO READ | డిజిటల్ అడ్రస్ ప్లాన్:ఇకపై ఇళ్లకు ఆధార్ లాంటి ఐడీనంబర్

ఏఐ వినియోగం ద్వారా కంపెనీకి భారీగా ఆదాయం మిగులుతోందని, ఆ డబ్బును కంపెనీ మార్కెటింగ్, అనుభవజ్ఞులైన టెక్కీలు, సేల్స్ ఆపరేషన్స్ మెరుగుపరచటం వంటి వాటికి వినియోగిస్తోందని ఆయన వెల్లడించారు. గతంలో కూడా కంపెనీ తొలగించిన ఉద్యోగుల స్థానంలో ఏఐ వినియోగానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి అమెరికాలోని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం ప్రస్తుతం భారీగా తొలగింపులు చేపడుతున్న క్రమంలో ఐబీఎం నుంచి ప్రకటన వచ్చింది. 

టెక్ దిగ్గజం గూగుల్ ప్రస్తుతం తాము జనరేట్ చేస్తున్న కోడింగ్ మెుత్తంలో 30 శాతం ఏఐ ద్వారా జరుగుతోందని సీఈవో సుందర్ పిచాయ్ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓపెన్ ఏఐ సంస్థ కూడా కోడింగ్ కోసం ప్రత్యేకంగా ఒక టూల్ క్రియేట్ చేసినట్లు ఈనెల ప్రకటించగా దీని ప్రభావం రానున్న కాలంలో కనిపించనుంది. వేల సంఖ్యలో పెద్ద కంపెనీల్లో ఉద్యోగులను ఏఐ టూల్స్ రీప్లేస్ చేయగలవని ప్రస్తుత పరిస్థితులు ముందుగానే హెచ్చరిస్తున్నాయి. ఏ రోజున ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితులను ఏఐ క్రియేట్ చేసిందని చాలా మంది టెక్కీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.