
ఈ మధ్య సోషల్ మీడియాను షేక్ చేసింది షేక్ హ్యాండ్ వివాదం. ఆసియా కప్ లో మ్యాచ్ తర్వాత పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇండియా ఆటగాళ్లు వెళ్లిపోవడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పాక్.. ఆ మ్యాచ్ కు రిఫరీగా పనిచేసిన ఆండీ పైక్రాఫ్ట్ ను తొలగించాలని పట్టుబట్టింది. బుధవారం (సెప్టెంబర్ 17) యూఏఈతో జరగే మ్యాచ్ లోనూ రిఫరీగా ఆయనే ఉండటంతే.. ఆ రిఫరీని తొలగించాలని డిమాండ్ చేసింది. తొలగించకపోతే ఆసియా కప్ నుంచి వైదొలగుతామని ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ని హెచ్చరించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).
ఐసీసీ ముందు పాక్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పీసీబీ అభ్యర్థనను ఐసీసీ కొటిపారేసింది. ఈ విషయంలో మరోసారి చర్చలకు తావులేదని తేల్చింది. పాక్ అభ్యంతరంతో ఈ వివాదంపై విచారించిన ఐసీసీ.. పాక్ చెప్పినట్లుగా రిఫరీపై చర్యలు తీసుకోలేమని పాక్ క్రికెట్ బోర్డుకు సూచించింది. రిఫరీని తొలగించకపోతే ఆసియా కప్ నుంచి స్కిప్ అవుతామని బెదిరిస్తున్న పాక్.. ఐసీసీ నిర్ణయంతో ఏం చేస్తుందో చూడాలి.
ఏంటీ షేక్ హ్యాండ్ వివాదం:
ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్లో పరిణామాలు రెండు దేశాల క్రికెట్ జట్ల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. టాస్ టైమ్లో ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ సారథి సల్మాన్ అలీ ఆగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.
విన్నింగ్ సిక్స్ కొట్టిన వెంటనే సూర్య నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్న శివం దూబేకు మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చి నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడు. ఇండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇస్తారని పాక్ ఆటగాళ్లు కాసేపు గ్రౌండ్లోనే వేచి చూసి వెళ్లిపోయారు. ఇండియా ఆటగాళ్ల ప్రవర్తన, మ్యాచ్ రిఫరీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పీసీబీ ఈ వివాదంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేసింది.
►ALSO READ | గ్రాండ్ స్విస్ విన్నర్ వైశాలి .. క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత
పాక్ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వద్దని ఇండియా ఇండియా ప్లేయర్లు తీసుకున్న నిర్ణయం గురించి రెఫరీ పైక్రాఫ్ట్ .. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగాకు చెప్పి ఐసీసీ ప్రవర్తనా నియమావళిని, క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ అతడిని తక్షణమే టోర్నమెంట్ నుంచి తొలగించాలని పాక్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం యూఏఈతో జరగబోయే పాకిస్తాన్ తదుపరి మ్యాచ్కు కూడా ఆండీ పైక్రాఫ్ట్నే రిఫరీగా ఉండటంతో పీసీబీ గుర్రుగా ఉంది. తమ డిమాండ్ను అంగీకరించని పక్షంలో యూఏఈతో మ్యాచ్ ఆడకుండా టోర్నీ నుంచి తప్పుకోవడమే తమ ముందున్న మార్గమని పీసీబీ హెచ్చరించింది.
అయితే హెచ్చరికలను ఐసీసీ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ విషయాన్ని ఎంటర్టైన్ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు ఐసీసీ వర్గాల సమాచారం. మరి రిఫరీని తొలగించకపోతే ఆసియా కప్ నుంచి స్కిప్ అవుతామని ప్రకటించిన పాక్.. బుధవారం మ్యాచ్ ఆడుతుందా లేక.. బెట్టుకు పోయి ఆడకుండా అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుంటుందా చూడాలి.