- రెపో బేస్డ్ లోన్లపై వడ్డీ పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్
- బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అదే బాటలో..
- ఇప్పటికే ఎంసీఎల్ఆర్ను పెంచిన స్టేట్బ్యాంక్, యాక్సిస్, కోటక్ బ్యాంకులు
బిజినెస్ డెస్క్, వెలుగు: ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించే వడ్డీ) ను 40 బేసిస్ పాయింట్లు (4.40 శాతానికి) పెంచడంతో దేశంలోని టాప్ బ్యాంకులు తమ లోన్లపై వడ్డీ రేటును పెంచడం స్టార్ట్ చేశాయి. రెపో రేటుతో లింక్ అయి ఉన్న హోమ్ లోన్లపై వడ్డీని ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు తాజాగా పెంచాయి. స్టేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులు కిందటి నెలలోనే తమ మార్జినల్ కాస్ట్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్) ను పెంచాయి. స్టేట్ బ్యాంక్ తమ ఎంసీఎల్ఆర్ను మరో రెండు బేసిస్ పాయింట్లు పెంచుతామని కూడా ప్రకటించింది. రెపో రేటుతో లోన్లు లింక్ అయి ఉంటే ఆర్బీఐ ఈ రేటును పెంచినప్పుడల్లా బ్యాంకులు కూడా లోన్లపై వడ్డీని మార్చాల్సి ఉంటుంది. అదే ఎంసీఎల్ఆర్ ఎంత ఉండాలనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి. కాగా, 2019, అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు తమ లోన్లను ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేటుకు లింక్ చేయడం తప్పనిసరి. ప్రస్తుతం వ్యవస్థలో బ్యాంకులు ఇచ్చే మెజార్టీ లోన్లు (53.1%) ఎంసీఎల్ఆర్తో లింక్ అయి ఉన్నాయి. 39.2 శాతం లోన్లు మాత్రం ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేటు (రెపో రేటు వంటివి) కు లింక్ అయి ఉన్నాయి. కాగా, తాము ఇచ్చే లోన్లను ఎంసీఎల్ఆర్తోనైనా, ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేటుతోనైనా బ్యాంకులు లింక్ చేయొచ్చు. ఈ రేట్ల కంటే తక్కువ వడ్డీని బ్యాంకులు వసూలు చేయడానికి ఉండదు.
ఐసీఐసీఐ, బీఓబీ లోన్లపై వడ్డీ పైకి..
ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్) ను 40 బేసిస్ పాయింట్లు (8.10 శాతానికి) పెంచింది. ఈ పెరిగిన రేట్లు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని కూడా పెంచింది. రూ. 5 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. మారిన ఎఫ్డీ రేట్లు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా రిటైల్ లోన్లపై రెపో రేటు లింక్డ్ వడ్డీ రేటును 6.90 శాతానికి పెంచింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, హోమ్ లోన్లపై వడ్డీ 6.90 శాతం నుంచి 8.25 శాతం మధ్య ఉంది.
ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లోన్ అంటే..?
బ్యాంకులు ఇచ్చే లోన్లను (పర్సనల్ లేదా రిటైల్) ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేటుకి లింక్ చేయడాన్ని 2019, అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ తప్పనిసరి చేసింది. బెంచ్మార్క్ రేటుగా దేనిని ఎంచుకోవాలో బ్యాంకులు నిర్ణయించుకోవడానికి స్వేచ్చ ఇచ్చింది. బ్యాంకులు ఆర్బీఐ రెపో రేటును లేదా ఫైనాన్షియల్ బెంచ్మార్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్బీఐఎల్) విడుదల చేసే 3–నెలల ప్రభుత్వ ట్రెజరీ బిల్లు ఈల్డ్ లేదా ఆరు నెలల ట్రెజరీ బిల్లు ఈల్డ్ను ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేటుగా వాడుకోవచ్చు. ఎఫ్బీఐఎల్ విడుదల చేసే ఇతర రేట్లను కూడా వాడుకోవచ్చు.
బారోవర్లపై భారం తొందరగానే..
రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెరగడంతో చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను త్వరలో పెంచనున్నాయి. దీంతో కొత్తగా లోన్లను తీసుకునేవారిపై, ఇప్పటికే లోన్లను తీసుకున్నవారిపై కూడా వడ్డీ భారం పెరుగుతుంది. ముఖ్యంగా రెపో రేటుతో లింక్ అయి ఉన్న లోన్లపై వడ్డీ తొందరగా పెరుగుతుంది. రెపో రేటు లేదా ఇతర బెంచ్మార్క్ రేటుకు లింక్ అయి ఉన్న లోన్లను ఇప్పటికే తీసుకున్న బారోవర్లపై వడ్డీ భారం కొంత లేటుగా పడొచ్చు. లోన్లను రీసెట్ చేసేంత వరకు వీరికి టైమ్ దొరుకుతుంది. లోన్లను రీసెట్ చేశాక తర్వాత రీసెట్ డేట్ వచ్చేంత వరకు కొత్త వడ్డీ రేట్లు అమల్లో ఉంటాయి. ఫిక్స్డ్ వడ్డీ రేటు దగ్గర లోన్లు తీసుకుంటే రెపో రేటు మారినా ఎటువంటి ప్రభావం ఉండదు.