
- గతంలో చందా కొచ్చర్ ఆఫర్ ఇచ్చారన్న హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్
న్యూఢిల్లీ: గతంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేరెంట్ కంపెనీ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ను కొనుగోలు చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రయత్నించిందని హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. టేకోవర్ చేసేందుకు ఆఫర్ ఇచ్చిందని, కానీ ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు చెప్పారు. కాగా, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ తన సబ్సిడరీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో విలీనమై, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్గా మారిన విషయం తెలిసిందే.
ఈ విలీనం జులై 1, 2023 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రివర్స్ మెర్జర్తో, 44 ఏళ్ల సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ చరిత్రలో భాగమైంది. ఆసక్తికరంగా, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఏర్పాటు కావడంలో గతంలో ఐసీఐసీఐ లిమిటెడ్ (ఐసీఐసీఐ బ్యాంక్ పేరెంట్ కంపెనీ) ఆర్థిక సాయం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్తో జరిగిన సంభాషణను పరేఖ్ గుర్తు చేసుకున్నారు. యూట్యూబ్లో విడుదలైన ఓ వీడియోలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు.
“నీవు ఒకసారి నాతో మాట్లాడిన సంగతి గుర్తుంది... నీవు చెప్పావు, హెచ్డీఎఫ్సీని ఐసీఐసీఐ స్టార్ట్ చేసింది. ‘ఇంటికి తిరిగి రా’ అని నీ ఆఫర్ ఇచ్చావు” అని చందా కొచ్చర్ని ఉద్దేశిస్తూ పరేఖ్ అన్నారు. అయితే, ఆ ఆఫర్ను తిరస్కరిస్తూ, “మా పేరు, బ్యాంక్, అన్నిటితో ఇది సరిగ్గా ఉండదు” అని ఆయన అన్నారు. తర్వాత జులై 2023లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో జరిగిన రివర్స్ మెర్జర్ ప్రధానంగా రెగ్యులేటరీ ఒత్తిడి వల్ల జరిగిందని వివరించారు.
“ఆర్బీఐ మాకు సపోర్ట్ చేసింది. ప్రాసెస్ను సులభతరం చేసి, అప్రూవల్ పొందేలా సహాయం చేసింది... కానీ ఎలాంటి ప్రయోజనాలు, రిలీఫ్లు, టైమ్ ఏమీ ఇవ్వలేదు” అని పరేఖ్ అన్నారు. ఈ మెర్జర్ సంస్థకు మంచిదని, దేశంలో పెద్ద బ్యాంకులు ఉండటం దేశానికి మంచిదని ఆయన చెప్పారు. భవిష్యత్తులో భారతీయ బ్యాంకులు ఒకదానిలో ఒకటి విలీనమై బలంగా మారాలని పరేఖ్ సూచించారు.