వీధి వ్యాపారులను పట్టించుకోని బల్దియా అధికారులు

వీధి వ్యాపారులను పట్టించుకోని బల్దియా అధికారులు
  • గుర్తింపు కార్డులిచ్చి.. లోన్లు ఇస్తలే!
  • స్ట్రీట్ వెండర్స్ కి  స్వనిధి స్కీమ్​వచ్చేదెన్నడు?
  • లాక్ డౌన్ తర్వాత పట్టించుకోని బల్దియా అధికారులు
  • ఏడాదిలో ఇప్పటివరకు ​25 శాతం మందికే రుణాలు

హైదరాబాద్, వెలుగు: సిటీలో  స్ర్టీట్ వెండర్స్​కు పీఎం స్వనిధి స్కీమ్ లోన్లు అందడంలేదు. కేంద్రం ఎంతమందికైనా  ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా లబ్ధిదారులకు లోన్లు రావడంలేదు. అధికారులు ముందుకు రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కరోనా, లాక్ డౌన్ తో  స్ట్రీట్​వెంటర్స్​ తీవ్ర కష్టాలు పడ్డారు. పెట్టుబడి కోసం బంధువులు, తెలిసినోళ్ల వద్ద అప్పులు తీసుకుంటున్నారు.  బల్దియా అధికారులు ప్రాసెస్ ని కంప్లీట్ చేయకపోవడంతోనే లోన్లు రావడంలేదు. 20 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా లోన్లు ఇవ్వడం లేదు.  గ్రేటర్​లో  లక్షా 60 వేల 205 మంది  స్ట్రీట్​వెండర్స్​ ఉన్నట్లు గుర్తించారు.  ఇందులో  ఒక లక్షా 59 వేల 424 మందికి బల్దియా గుర్తింపు కార్డులను కూడా ఇచ్చింది.  స్వనిధి లోన్లు ఇప్పటించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఏడాదిలో కేవలం 40,237 మందికి మాత్రమే  10 వేల చొప్పున లోన్లు వచ్చాయి. 

లాక్ డౌన్ తర్వాత స్లోగా...
లాక్ డౌన్ తర్వాత  స్ట్రీట్ వెండర్స్​కు లోన్లు ఇస్తే పెట్టుబడి కోసం ఎంతో ఉపయోగపడుతుంది. బల్దియా అధికారులు మాత్రం చాలా స్లోగా ప్రాసెస్​ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కేవలం  6 వేల మందికి మాత్రమే లోన్లు వచ్చాయి. అది కూడా అంతకు ముందు మంజూరు అయిన వారికి మాత్రమే ఇచ్చారు. కొత్త వారినైతే అసలు గుర్తించడంలేదు. లాక్ డౌన్ తర్వాత ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న స్ర్టీట్ వెండర్స్​కి ఇంకా లోన్లు వస్తలేదు. 

ఏడాదిలో 25 శాతం మందికే.. 
గతేడాది జులైలో పీఎం స్వనిధి స్కీమ్ స్టార్ట్​ అయ్యింది. ఇప్పటివరకు కేవలం 25 శాతం మంది లబ్ధిదారులకే  లోన్లు అందాయి. స్కీమ్ పై బల్దియా అధికారులు, సిబ్బంది  ఇంట్రెస్ట్ చూపించడంలేదు. దీంతో స్ర్టీట్ వెండర్స్​కు  లోన్లు అందడంలేదు. లోన్లు ఇవ్వాలంటే ఆఫసీర్ల చుట్టూ తిరుగుతున్నా అధికారులు ముందుకు రావడంలేదు.  సంబంధిత డాక్యుమెంట్లను స్ట్రీట్​వెండర్స్​వద్ద తీసుకొని  బల్దియా ఆఫీసర్లు బ్యాంకులో అందజేస్తే లబ్ధిదారులకు  లోన్లు ఇస్తారు. ఈ పని కూడా పూర్తి చేయడం లేదు.