
వాషింగ్టన్: కరోనా కేసుల్లో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయినా అమెరికానే బెటర్ అంటున్నారు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. టెస్టులు ఎక్కువ చేస్తే ఇండియాలో ఇంకెక్కువ కేసులు ఉండేవంటున్నారు. అవును, శనివారం మైన్ రాష్ట్రంలోని ప్యూరిటన్ మెడికల్ ఫ్యాక్టరీ దగ్గర ఆయన మాట్లాడారు. ఆ టైంలోనే కరోనా కేసులకు సంబంధించి, ఇండియా, చైనా ఊసెత్తారు. అమెరికాలో 2 కోట్లకు పైగా టెస్టులు చేసినట్టు చెప్పారు. అమెరికాతో పోలిస్తే జర్మనీ 40 లక్షలు, సౌత్ కొరియా30 లక్షల టెస్టులు చేశాయన్నారు. జాన్స్ హాప్కిన్స్ కరోనావైరస్ రిసోర్స్ సెంటర్ లెక్కల ప్రకారం… అమెరికాలో19 లక్షల కరోనా కేసులు, లక్షా 9 వేల మరణాలు నమోదయ్యాయి. ఇక మనదేశంలో 2,36,184, చైనాలో 84,177 కేసులు నమోదయ్యాయి. మనదేశంలో దాదాపు 45 లక్షల టెస్టులు చేశారు.
టెస్టులు ఎక్కువ చేస్తే.. కేసులెక్కువైతయ్
అమెరికాలో కరోనా టెస్టులపై ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మనం 2 కోట్లకు పైగా టెస్టులు చేశాం. టెస్టులు ఎక్కువ చేస్తే కేసులు ఎక్కువగా వస్తాయన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రజలకు ఇదే చెప్తున్నా. ఎక్కువ టెస్టులు చేయడం వల్లే ఎక్కువ కేసులు బయటపడ్డాయి. చైనాలో లేదా ఇండియాలో లేదా ఇతర ఏ ప్రాంతాల్లోనైనా టెస్టులు ఎక్కువగా చేసుంటే, కేసులూ ఎక్కువయ్యేవి” అని ట్రంప్ చెప్పారు. ‘‘ర్యాపిడ్ టెస్టింగ్ కు ఉపయోగించే హై క్వాలిటీ మెడికల్ స్వాబ్స్ ను తయారు చేసే కొన్ని ఫ్యాక్టరీల్లో ప్యూరిటన్ ఒకటి. ప్యూరిటన్ లో తయారయ్యే ప్రతి స్వాబ్ కు గర్వంగా ‘మేడ్ ఇన్ ది యూఎస్ఏ’ అనే స్టాంప్ వేస్తారు. టెస్టింగ్ కెపాసిటీ పెంచడాన్ని సాధ్యం చేసినందుకు మీకు థ్యాంక్స్. ఎవరూ ఊహించనంతగా మన ఎకానమీ తిరిగి ఓపెన్ అయి, రికవర్ అవుతోంది” అని ట్రంప్ అన్నారు.
చరిత్రలోనే ఎక్కువ జాబ్స్..
తాజా మంత్లీ ఎంప్లాయ్ మెంట్ లెక్కలను చెప్తూ, ఎకానమీ మళ్లీ ట్రాకులో పడిందని ట్రంప్ చెప్పారు. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉద్యోగాలు సృష్టించిన నెల అని అన్నారు. వచ్చే ఏడాదిలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందన్నారు. చాలా ముఖ్యమైన డేట్ అయిన నవంబరు 3 కంటే ముందు రెండు నెలలు అద్భుతంగా ఉంటాయన్నారు.
రాంగ్ ప్రెసిడెంటొస్తే..
‘‘ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. ఎందుకంటే.. మీరు రాంగ్ ప్రెసిడెంట్ ను గెలిపిస్తే.. వాళ్లు ట్యాక్స్ లు పెంచుతారు. బార్డర్లను తెరుస్తారు. ప్రతి ఒక్కరూ దేశంలోకి వచ్చేస్తారు. గత మూడేళ్లలో బలమైన ఎకానమీని నిర్మించాను. కరోనా వల్ల సంక్షోభంలో పడిన ఎకానమీని మళ్లీ ట్రాక్ లోకి తెస్తాను. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కరోనాపై పోరాటమే అతిపెద్ద సమస్యగా మారింది. దీనివల్ల దేశవ్యాప్తంగా భారీగా ఇండస్ట్రియల్ మొబిలైజేషన్ జరిగింది” అని ట్రంప్ చెప్పారు. కంటికి కనిపించని ఈ శత్రువును జయించేందుకు తమ ప్రభుత్వం ఫుల్ పవర్ ను ప్రయోగించిందన్నారు. ‘‘వాస్తవానికి అది ఒక ఎనిమీ. చైనా నుంచి వచ్చింది. దానిని చైనాలోనే ఆపాల్సింది. కానీ వారు ఆ పని చేయలేదు” అని ట్రంప్
ఆరోపించారు.
1.5 బిలియన్ పీపీఈ కిట్లు..
కరోనా వైరస్ పై పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి తమ సర్కారు 150 కోట్లకు పైగా పీపీఈ కిట్లను ఇచ్చిందని ట్రంప్ చెప్పారు. వ్యాక్సిన్ ల తయారీ వేగవంతం అయ్యేందుకు రూల్స్ కూడా సడలించామన్నారు.. ప్యూరిటన్ వంటి ప్రైవేట్ కంపెనీలతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద, అడ్వాన్స్డ్ టెస్టింగ్ కెపాసిటీని సాధించామన్నారు. మైన్ లోని ప్యూరిటన్ ఫ్యాక్టరీ వేగంగా స్వాబ్స్ తయారీకి చర్యలు తీసుకుందని, దాదాపుగా ప్రతి నెలా 2 కోట్ల స్వాబ్స్ ను తయారు చేసిందన్నారు. ఏప్రిల్ లో డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ను ప్రకటించడం వల్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు వీలైందన్నారు. 7.5 కోట్ల డాలర్ల పీపీపీ ప్రాజెక్టు కింద ప్యూరిటన్ త్వరలో నెలకు 4 కోట్ల స్వాబ్స్ ను తయారు చేస్తుందన్నారు.