అన్యాయం జరిగితే సుప్రీంకు వెళ్తాం.. బనకచర్లపై కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్

అన్యాయం జరిగితే సుప్రీంకు వెళ్తాం.. బనకచర్లపై కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్

బనకచర్లపై తెలంగాణకు అన్యాయం జరిగితే సుప్రీం కోర్టుకు  వెళ్తామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్రం బనకచర్ల విషయంలో తెలంగాణకు న్యాయం చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. లేని పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 

గురువారం (జూన్ 19) ఢిల్లీలో బనకచర్ల వివాదంపై కేంద్ర జలవనరుల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,  నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  సీఎం రేవంత్ టీమ్.. బనకచర్లపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి బనకచర్ల నిర్మిస్తోందని కంప్లైంట్ ఇచ్చామని భేటీ తర్వాత మంత్రి ఉత్తమ్ తెలిపారు. 

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్..తమ అభ్యంతరాలను కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ కు చెప్పినట్లు తెలిపారు. ఏపీ చట్ట వ్యతిరేకింగా నిర్మాణం చేపడుతుందని.. అనుమతులు ఇవ్వద్దని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బనకచర్ల నిర్మాణంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. బనకచర్ల పునర్విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ రైతుల్లో ఆందోళన నెలకొందని, బనకచర్లకు అనుమతి ఇవ్వద్దని కోరినట్లు చెప్పారు.

బనకచర్లపై తెలంగాణ ఫిర్యాదులను, అభ్యంతరాలను విన్న కేంద్ర మంత్రి పాటిల్.. తెలంగాణకు అన్యాయం జరగదని చెప్పారని తెలిపారు. ఇప్పటి వరకు బనకచర్ల డీపీఆర్ తమ వద్దకు రాలేదని, వచ్చిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని తెలిపారు మంత్రి ఉత్తమ్. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవానికి నిధులివ్వాలని కోరినట్లు చెప్పారు.