
యాదాద్రి, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్కరువు పేరుతో ఆలేరులో అడుగుపెడితే ప్రజలు బండకేసి కొడుతారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హెచ్చరించారు. కరువు పర్యటనలో భాగంగా కేసీఆర్ఉగాది తర్వాత ఆలేరులో పర్యటిస్తారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి చేసిన ప్రకటనపై మంగళవారం ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఆలేరులో ఒక్క ఎకరాకు కూడా సాగునీరివ్వని కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఆలేరుకు వస్తారని ప్రశ్నించారు.
గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేస్తామని స్వయంగా ప్రకటించిన కేసీఆర్.. ఎందుకు చేయలేదని నిలదీశారు. బస్వాపూర్ రిజర్వాయర్ నీటిని ఎందుకు రప్పించలేదని, నవాబ్పేట నుంచి గుండాలకు నీళ్లు ఎందుకు సరఫరా చేయలేదని ప్రశ్నించారు. బునాదిగాని కాల్వ పనులు ఎక్కడికక్కడే ఉన్నా పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారంలో ఉన్న పదేండ్లు ఆలేరు ప్రజలకు ఉత్తి మాటలే చెప్పారే తప్ప అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదేండ్లలో కనిపించని కరువు ఇప్పుడే కనిపించిందా..? అని మండిపడ్డారు.