- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
- ఈటల గెలిస్తేనే దళితులకు న్యాయం జరుగుతది
- కమలాపూర్లో వివేక్ ఇంటింటి ప్రచారం
కమలాపూర్, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచడానికి ఈటల రాజేందర్ను గెలిపించాలని హుజూరాబాద్ ప్రజలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ లీడర్లు మాయమాటలు చెప్తూ మభ్యపెడుతున్నారని, వాళ్ల మాటలు నమ్మొద్దని కోరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తేనే దళితులకు న్యాయం జరుగుతుందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు సాధించేదాకా పోరాడాలన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కమలాపూర్లోని దళిత కాలనీల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు మద్దతుగా వివేక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి పెద్దలు, యువకులను పలకరిస్తూ.. కమలం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈవీఎంలో మొదట కమలం గుర్తు ఉంటుందని, ఆ బటన్ నొక్కి ఈటలకు ఓటేయాలని కోరారు. ఈటలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు. డబ్బులతో ఓట్లు కొనాలని అధికార పార్టీ చూస్తోందని, ఆ డబ్బంతా ప్రజల సొమ్మేనన్నారు. వారు ఇచ్చే డబ్బు తీసుకుని ఓటును ఈటలకు వేయాలని కోరారు. ప్రచారంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం గౌడ్, నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి, రాకేశ్, మాట్ల రమేశ్, కొలుగూరి రాజ్ కుమార్, ఒస్కుల పవన్, మాట్ల కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.