- పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి తెస్తరా
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
గంగాధర/రామడుగు, వెలుగు : ‘కేంద్రంలో మళ్లీ ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే.. అన్ని సర్వేలూ ఇదే చెప్తున్నయ్, అలాంటప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ? పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోయి తెస్తారా ?’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఎక్కువ నిధులు తీసుకొస్తామని చెప్పారు. గంగాధర, రామడుగు మండలాల్లో శనివారం జరిగిన ప్రజాహిత యాత్రలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జీతాలివ్వడానికే పైసల్లేవని, ఆరు గ్యారంటీలను ఎలా అమలుచేస్తారని ప్రశ్నించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సాగు నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. సాగు నీటిని విడుదల చేయకపోతే ఇరిగేషన్ ఆఫీస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ఎన్నికల కోడ్ను చూపి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
అనంతరం రామడుగు మండలం గోపాల్రావుపేట బస్టాండ్ వద్ద నేచర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆవిష్కరించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ చొప్పదండి నియోజకవర్గ కన్వీనర్ పెరుక శ్రావణ్కుమార్, నాయకులు వైద రామానుజం ఉన్నారు.
