ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు
వాళ్లకు కిడ్నాపుల్లో కాపీరైట్స్ ఉన్నయ్
కొత్త జాబ్ లు కాదు.. ఉన్నవి కూడా పోతయ్
కంపెనీలు బందైతయ్ .. రాష్ట్రం నుంచి పారిపోతయ్
దర్భంగ, పట్నా, ముజఫర్ పూర్ లలో ముమ్మర ప్రచారం
దర్భంగ/ముజఫర్పూర్/పట్నా: ఆర్జేడీ నేత, సీఎం కేండిడేట్ తేజస్వీ యాదవ్పై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. జంగల్ రాజ్ కే యువరాజ్ అంటూ విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ అధికారంలోకి వస్తే బీహార్ మళ్లీ రోగాలమయమవుతుందని హెచ్చరించారు. ‘కొత్త ప్రభుత్వ ఉద్యోగాలేమో గాని వాళ్లు గెలిస్తే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న జాబ్లు కూడా పోతాయ్’ అని ఆర్జేడీ 10 లక్షల సర్కారు జాబ్ల హామీపై విమర్శలు చేశారు. ‘కిడ్నాపింగ్స్లో ఆ పార్టీకి కాపీరైట్స్ ఉన్నాయి. వాళ్ల దెబ్బకు కంపెనీలు బందైపోతాయి. ఫ్యాక్టరీల యజమానులు రాష్ట్రం వదిలి పారిపోతారు’ అన్నారు. బీహార్ రాజధాని పట్నా, దర్భంగ, ముజఫర్పూర్లో బుధవారం జరిగిన ప్రచారంలో మోడీ పాల్గొన్నారు.
జాబుల పేరుతో ఇంకిన్ని కూడబెట్టుకుంటరు
రాష్ట్ర ప్రజల, పేదల, మిడిల్ క్లాస్ జనాల అవసరాలు, ఆశలు తీర్చేంత విశ్వసనీయత, అనుభవం ఆ యువరాజుకు(తేజస్వీ) ఉందా అని బీహారీలు ఆలోచించాలన్నారు. రాష్ట్రాన్ని చీకటి నుంచి బయటకు తీసుకొచ్చిన వాళ్లను మళ్లీ గెలిపించుకోవాలన్నారు. నితీశ్ ప్రభుత్వం బీహార్ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దిందని పొగిడారు. ‘ప్రజల డబ్బును లూఠీ చేసిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. అలాంటి వాళ్లు కొత్త ఉద్యోగాలతో ఇంకిన్ని డబ్బులు కూడబెట్టుకుంటారు’ అని తేజస్వీపై విమర్శలు చేశారు.
వాళ్లు గెలిస్తే బీహార్ మళ్లీ మొదటికే
ఈ కరోనా టైమ్లో ప్రతిపక్షాలకు ఓటేస్తే బీహార్ డేంజర్లో పడ్డట్టేనని ప్రజలను మోడీ హెచ్చరించారు. ‘ప్రస్తుతం బీహార్ రెండు సమస్యలను ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి బీహార్కు, ప్రపంచానికి సవాలు విసురుతోంది. మరోవైపు బీహార్ను రోగాలమయం చేసిన వాళ్లు ఓట్లేయమని అడుగుతున్నారు. మీరు, మీ ఫ్యామిలీ హెల్దీగా ఉండాలంటే వాళ్ల నుంచి రక్షించుకోండి. లేదంటే రాష్ట్రం మళ్లీ మొదటికొస్తుంది’ అని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం పక్కనబెట్టిన డబ్బులపై కొందరు కన్నేశారన్నారు. లాలూ ఫ్యామిలీ 15 ఏండ్లు అధికారంలో ఉన్న టైమ్లో జరిగిన క్యాస్ట్ గొడవల గురించి మోడీ ప్రస్తావించారు. ‘ వాళ్ల రాజకీయాలంతా అబద్ధాలు, మోసాలు, గందరగోళం. బీహార్ అభివృద్ధికి వాళ్ల దగ్గర రోడ్ మ్యాప్ లేదు. ప్రభుత్వాన్ని నడిపించే అనుభవమూ లేదు’ అని ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు.
స్థానిక మాండలికాల్లో మాట్లాడుతూ..
వెళ్లిన ప్రతిచోటా స్థానిక మాండలికంలో స్పీచ్ స్టార్ట్ చేసి మోడీ ఆకట్టుకున్నారు. లోకల్ హీరోలను గుర్తు చేసుకున్నారు. బీహార్ దళిత ఐకాన్ బాబా చౌహర్మల్కు నివాళులర్పించారు. తల్లి సీతా దేవి పుట్టిన మిథిలలో ఉన్నందుకు సంతోషంగా ఉందని చెబుతూ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదలైందని దర్భంగలో ర్యాలీ సందర్భంగా గుర్తు చేశారు.
80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ చిన్న విషయం కాదు: నితీశ్
ఎన్డీయేకు ఓటేస్తే మోడీ బీహార్ను అభివృద్ధి చెందిన రాష్ట్రం చేస్తారని ఆ రాష్ట్ర సీఎం, జేడీ(యూ) ప్రెసిడెంట్ నితీశ్ కుమార్ అన్నారు. పట్నా మెట్రో ప్రాజెక్టు, స్మార్ట్ సిటీస్ ప్లాన్, ఉజ్వల స్కీమ్ గురించి ప్రస్తావించారు. కరోనా కంట్రోల్కు మోడీ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని పొగిడారు. దేశంలోని 80 కోట్ల మందికి ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఫ్రీ రేషన్ ఇవ్వడం చిన్న విషయం కాదన్నారు.
for more news….