వంట చేసేటప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల పోషకాలు వృథాగా పోతాయి. అలా కాకూడదంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఇలా చేసిన కూరలు రుచిగా ఉండటమే కాకుండా… శరీరానికి కావాల్సిన పోషకాల్ని కూడా అందిస్తాయి.
క్యాబేజీ
క్యాబేజీని ఉడికించేటప్పుడు నీళ్లలో నూనె లేదా కాస్త వెన్న వేయాలి. అప్పుడు పోషకాలు పోవు. అలాగే క్యాబేజీ ఎక్కువగా వేగించినా, ఉడికించినా సల్ఫర్ విడుదలై రుచి మారిపోతుంది. అలాగే కూరగాయలు తేమగా ఉండటానికి వాటిని ఐస్ నీళ్లలో ముంచొద్దు. వేడినీళ్లలాగే చల్లటి నీళ్లు కూడా కూరగాయల్లో ఉండే విటమిన్లు, మినరల్స్ పోయేలా చేస్తాయి.
సిట్రస్ చేర్చాలి
పాలకూర, బ్రొకోలి, లాంటి కూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అయితే దాన్ని శరీరం నేరుగా వినియోగించుకోలేదు. అలకాకూడదంటే సిట్రస్ పళ్లలో ఉండే విటమిన్–సి ని ఐరన్లో చేర్చాలి. అప్పుడు ఐరన్ని శరీరం తేలిగ్గా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. ఉడికించిన, వేగించిన కూరలపై కొంచెం నిమ్మ, ఆరెంజ్ లేదా ద్రాక్ష రసం చల్లితే శరీరానికి విటమిన్లు, పోషకాలు, ఐరన్ అన్నీ బాగా అందుతాయి.
ఆలుగడ్డ
ఆలుగడ్డల్ని చిన్నచిన్న ముక్కలుగా కోసి ఉడికించొద్దు. ఇలా చేయడం వల్ల వాటిలోని పోషక విలువలన్నీ పోతాయి. ఆలుగడ్డల్ని బాగా కడిగి మధ్యకు కోసి పొట్టుతో సహా ఉడికించాలి. అలా చేయడం వల్ల ఆలుగడ్డ పొట్టులో ఉండే పీచు పోదు. ఇతర పోషకాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. కూరగాయలు బాగా ముదురుగా ఉంటే తప్ప తోలు తీయకూడదు.
కూరగాయలు తరిగేటప్పుడు…
కూరగాయలను తరగకముందే నీళ్లతో శుభ్రంగా కడగాలి. అలాగే కొన్ని కూరగాయల పైనున్న తొక్కను తీసేస్తుంటాం. కానీ, ఆ తొక్క కింద భాగంలోనే న్యూట్రియంట్లు ఉంటాయి. అందుకని సాధ్యమైనంతవరకూ కూరగాయలు తొక్క తీయకుండా వండాలి. చాలామంది కూరగాయలు తరిగి, తర్వాత ఎప్పుడో వండుతుంటారు. కానీ అలా చేయడం వల్ల తరిగిన కూరగాయ ముక్కలపై వెలుగు పడి, గాలి తగిలి వాటిల్లో ఉండే న్యూట్రియంట్లు పూర్తిగా పోతాయి. అందుకే తరిగిన వెంటనే వండాలి.
ఉల్లిగడ్డలు
సలాడ్లు, బర్గర్లు, శాండ్విచ్వంటి వాటిల్లో పచ్చి ఉల్లిగడ్డ ముక్కలు వేస్తుంటాం. నిజానికి ఇది మంచి పద్ధతి. పచ్చివాటిల్లో సల్ఫర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. జీవక్రియరేటును పెంచుతుంది. అదే పద్ధతిని కూర చేసేటప్పుడు ఫాలో అయితే మంచిది. ఉల్లిగడ్డల్ని మరీ వేగించకుండా పచ్చి వాసన పోయేలా వేగిస్తే చాలు. – క్యారెట్లాంటి వాటిని ఉడికించి ముక్కలు కోయడం కన్నా.. ముక్కలు తరిగాక వేగించాలి.
మాంసం– చేపలు
వీటిని పెద్ద మంటమీద ఉడికిస్తే మాంసకృత్తులు పోతాయి. మాంసం, చేపల్ని ఎప్పుడూ తక్కువ మంట మీద ఉడికించాలి. అలాగే కూరగాయల్లో ఉండే పోషక విలువలు, రుచి పోకుండా ఉండాలంటే వాటిని నానబెట్టకూడదు. వెల్లుల్లిని తరిగి వెంటనే పోపులో వేయకుండా ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. కాసేపు గాలికి ఉంచడం వల్ల వాటిల్లో క్యాన్సర్తో పోరాడే గుణాలు పెరుగుతాయి.