వివాదాస్పద భూమిలో అక్రమ నిర్మాణాలు.. మియాపూర్లో రెండు భవనాలు సీజ్

వివాదాస్పద భూమిలో అక్రమ నిర్మాణాలు.. మియాపూర్లో రెండు భవనాలు సీజ్
  • కోర్టు ఆదేశాలతో టౌన్​ ప్లానింగ్ అధికారుల చర్యలు
  • మిగిలిన నిర్మాణాలపై స్థానికుల ఆగ్రహం
  • సీజింగ్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు

మియాపూర్, వెలుగు: మియాపూర్​లోని వివాదాస్పద భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన రెండు అక్రమ నిర్మాణాలను చందానగర్​ టౌన్ ​ప్లానింగ్ అధికారులు బుధవారం సీజ్​చేశారు. శేరిలింగంపల్లి మండలంలోని మియాపూర్​మక్త మహబూబ్​పేట​ గ్రామ పరిధిలోని సర్వే నంబర్​ 44లో 260 ఎకరాల ప్రభుత్వ భూమిపై వివాదం నడుస్తుంది. ఈ భూమిపై కోర్టులో కేసులు పెండింగ్​లో ఉండగా, జీహెచ్ఎంసీ నుంచి ఇంటి నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు జీహెచ్ఎంసీ చందానగర్ టౌన్​ ప్లానింగ్​ఏసీపీ, టీపీఎస్​లను మేనేజ్ చేసి భారీ భవన నిర్మాణాలను చేపడుతున్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకే ఎన్‌‌ క్లేవ్, రెడ్డి కాలనీల్లోని ఈ భవనాలను కోర్టు ఆదేశాలతో అధికారులు బుధవారం సీజ్​ చేశారు. 

మిగిలిన అక్రమ నిర్మాణాల సంగతేంటి ?
ఇదే సర్వే నంబర్ ​44లో నాగార్జున ఎన్​క్లేవ్, రెడ్డికాలనీ, బీకే ఎన్​క్లేవ్​ కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీల్లో చేపడుతున్న భవన నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. కానీ టౌన్​ప్లానింగ్​అధికారుల అండదండలతో నిర్మాణదారులు ఐదు, ఆరు అంతస్తులకు మించకుండా అక్రమ భవనాలను నిర్మిస్తూ ఫ్లాట్లను అమాయక ప్రజలకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కాలనీల్లో వెలసిన మిగిలిన అక్రమ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్​చేస్తున్నారు.

సీజ్ పేరిట వసూల్ దందా!
ఇటీవల జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్​అధికారులు అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇస్తూ సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసిన వారం, పది రోజుల్లో తిరిగి సదరు సీజింగ్​బిల్డింగ్​లో నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజ్​చేసిన టౌన్​ప్లానింగ్​అధికారుల చేతులు తడిపితే తిరిగి నిర్మాణం చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తునట్లు తెలుస్తుంది. ఇటీవల చందానగర్​సర్కిల్​హఫీజ్​పేట డివిజన్​గంగారం గ్రామంలో ఓ వ్యక్తి ఎలాంటి రోడ్డు లేకుండానే 800 గజాల్లో అక్రమ నిర్మాణాన్ని చేపట్టాడు. దీనికి నోటీసులు ఇచ్చిన టౌన్​ ప్లానింగ్​ ఏసీపీ నాగిరెడ్డి, టీపిఎస్​ రమేశ్​తో కలిసి సీజ్​ చేశారు. 

సీజింగ్ చేసిన పది రోజుల్లోనే నిర్మాణదారుడు సీజింగ్​బ్యానర్లు, రిబ్బన్లను తొలగించి తిరిగి నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాడు. ఇలా అక్రమ నిర్మాణాల సీజింగ్​పేరుతో టౌన్​ ప్లానింగ్​అధికారులు వసూళ్ల దందాకు తెరలేపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిర్మాణాలను మొదట్లోనే అడ్డుకోవల్సిన టౌన్​ ప్లానింగ్​ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.​ ఈ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే నోటీసులతో సరిపెడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై ఎవరైనా కోర్టుకు వెళ్లి సీజింగ్​ఆర్డర్​ తెస్తే తప్ప సీజింగ్​ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.