ముదిగొండ, వెలుగు:- ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో జంతువుల కొవ్వుతో నూనె తయారు చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు 150 లీటర్ల కల్తీ నూనెను సీజ్ చేశారు.
వెంకటాపురంలోని ఓ ఇంటి వద్ద మాంసం విక్రయిస్తుండడంతో గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి స్రవంతి, సర్పంచ్ కందుల బాలచందర్కు ఫిర్యాదు చేశారు. వారు అక్కడ పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్నట్లు గుర్తించి, ఖమ్మం ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్ కు సమాచారం ఇచ్చారు.
తనిఖీలు నిర్వహించి షేక్ సర్వర్ జానీ, అతని సోదరుడు అన్వర్ జానీ పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 150 లీటర్ల నూనెను సీజ్ చేశారు. ఈ నూనెను ఎవరు కొనుగోలు చేస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఎందుకు వాడుతున్నారు? ఎంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతోందనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్ తెలిపారు.
