
తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా జులై 23న మూడు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని సూచించింది. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అరేంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.
జనగాం, కరీంనగర్, మెదక్, ములుగు, సిద్ధిపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, జిల్లాలలో వచ్చే 2-3 గంటల్లో మోస్తరు వర్షాలు పడతాయని ఆరెంజ్ అలెర్ట్స్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో గంటకు 41-61 కి.మీ.ల వేగంతో ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాలు, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ఈ జిలాల్లో గంటకు 40 కి.మీ కంటే తక్కువ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని సూచించింది వాతావరణ శాఖ..
మరో వైపు పెద్దపల్లి జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా రామగుండం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. రామగుండం రీజియన్ లోని 4 ఓసీపీలలో రోజుకు 40 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ క్వారీలు జలమయం అయ్యాయి.