ఏపీలో నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. శుక్రవారం ( ఆగస్టు 28 ) సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. నియోజక వర్గాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించుకుని పని చేయడం దేశంలోనే ప్రధమంగా ఏపీలోనే అమలు చేస్తున్నామని అన్నారు. దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని అన్నారు.
ఈ క్రమంలో నియోజకవర్గాల విజన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది కీలక పాత్ర అని... రూపొందించుకున్న కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లకు అనుగుణంగా ఆయా రంగాల్లో వృద్ధి నమోదు చేసేలా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు.
నియోజకవర్గాల విజన్ ప్లానులో యంగ్ ప్రొఫెషనల్స్, నాలెడ్జ్ పార్టనర్లు, స్వర్ణ కార్యాలయాల సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని... ఆ మేరకు వీళ్లంతా వినూత్నంగా ఆలోచించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం... ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయడం వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు చంద్రబాబు.
స్థానికంగా ఉండే వనరుల లభ్యతను ఆధారంగా చేసుకుని ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలను సిద్దం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నియోజక వర్గాల విజన్ ను అందించామని, ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విజన్ ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు.
