మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కేరళలోని కొచ్చి పోలీసులు షాక్ ఇచ్చారు. పాఠశాల విద్యార్థుల తరహాలో వారితో ఇంపోజిషన్ రాయించారు. కొచ్చిలో ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఓ వాహనదారుడు చనిపోయాడు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకొని మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
అప్రమత్తమైన పోలీసులు నిన్నటి నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టుబడిన మందుబాబులకు త్రిపునితుర పోలీసులు వినూత్నంగా శిక్ష వేశారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా వారితో వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించారు.‘ఇకపై తాగి డ్రైవింగ్ చేయను’ అని వారితో వెయ్యిసార్లు రాయించారు. ఇంపోజిషన్ రాసినప్పటికీ వారికి అసలు శిక్ష తప్పదని పోలీసులు స్పష్టం చేశారు.
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి వార్నింగులు ఇచ్చి .. జరిమానాలు విధించి.. విసిగిపోయిన పోలీసులు చివరకు ఇలా వినూత్నంగా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి శిక్ష విధించారు. నేల మీద కూర్చొని ఇంపోజిషన్ రాయించారు. మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేసి, వారి లైసెన్సులను కూడా రద్దు చేయిస్తామని చెప్పారు.