న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఎంఎల్లిమిటెడ్లో(ఒకప్పుడు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) వాటా అమ్మకానికి త్వరలోనే ఫైనాన్షియల్బిడ్స్ను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. ఇది వరకే జనవరి 2021లో ఈ ప్రభుత్వ రంగ యూనిట్లో 26 శాతం వాటాను విక్రయించడానికి కేంద్రం ప్రైమరీ బిడ్లను ఆహ్వానించింది. అప్పుడు కూడా పలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ (ఈఓఐలు) వచ్చాయి.
దీని తరువాత, బీఈఎంఎల్ తన నాన్-కోర్ వ్యాపారాలను బీఈఎంఎల్ ల్యాండ్ అసెట్స్గా విడదీసి, కొత్త కంపెనీని 19 ఏప్రిల్ 2023న స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసింది. బీఈఎంఎల్ నిర్మాణం, రక్షణ సంబంధిత వ్యాపారం కోసం ఫైనాన్షియల్ బిడ్లను పిలుస్తారని ఒక అధికారి చెప్పారు. "భూమి, ఇతర నాన్-కోర్ ఆస్తుల జాబితా తయారీ పూర్తయింది. మేం త్వరలో నిర్మాణం, రక్షణకు సంబంధించిన ప్రధాన ఆస్తుల కోసం ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానిస్తాం" అని ఆయన తెలిపారు. బీఈఎంఎల్ ... డిఫెన్స్ & ఏరోస్పేస్, మైనింగ్ & కన్స్ట్రక్షన్, రైల్ & మెట్రోలకు ఉత్పత్తులను, సేవలను అందిస్తోంది.
విదేశీ క్లయింట్లతోనూ ఇది బిజినెస్ చేస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ ప్రభుత్వ రంగ సంస్థలో కేంద్రానికి ప్రస్తుతం 54.03 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, బీఈఎంఎల్లో ప్రభుత్వం 26 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఖజానాకు దాదాపు రూ.1,500 కోట్లు వస్తాయి. డిసెంబర్ 31, 2022తో ముగిసిన క్వార్టర్లో బీఈఎంఎల్ లాభం 15.5 శాతం తగ్గి రూ.66.30 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.78.51 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదు చేసింది. భారీ వస్తువులను తరలించడం, రైల్వేలు, రవాణా మైనింగ్ కోసం ఉపయోగించే అనేక రకాల భారీ పరికరాలను తయారు చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.
