మొదటి విడతలో110 రైతు వేదికల్లో అందుబాటులోకి వీడియో కాన్ఫరెన్స్ సేవలు

మొదటి విడతలో110 రైతు వేదికల్లో అందుబాటులోకి వీడియో కాన్ఫరెన్స్ సేవలు
  •     మొదటి విడతలో110 రైతు వేదికల్లో అందుబాటులోకి 
  •     ప్రతీ ఏడీఈ డివిజన్ పరిధిలో ఒకటి చొప్పున ఏర్పాటు
  •     ఇప్పటికే టెస్టింగ్ పూర్తి 
  •     దశల వారీగా అన్నిచోట్లకు 
  •     రైతులు నేరుగా సమస్యలు ప్రస్తావించేందుకు చాన్స్ 

హైదరాబాద్, వెలుగు:  రైతు వేదికలను ఆధునీకరించి అగ్రికల్చర్ సేవలను మరింత విస్తరించాలని వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలను అందించడానికి సిద్ధమైంది.

వీడియో కాన్ఫరెన్స్ సౌలతుల కోసం ఆండ్రాయిడ్ టెలివిజన్లు, ఇంటర్నెట్ సౌలతులతో రైతు వేదికలను తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు రైతులతో నేరుగా కమ్యూనికేట్ చేస్తూ వ్యవసాయ రంగంలో తీసుకువస్తున్న సంస్కరణలపై అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయ నిపుణులు, అధికారులు, వెటర్నరీ డాక్టర్లు సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సమావేశాలు నిర్వహించి, వారికి సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. 

విడతలవారీగా ఆధునీకరణ 

హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లోని రైతు వేదికలను ఆధునీకరించడానికి వ్యవసాయశాఖ సిద్ధమైంది. మెదటి దఫాగా ప్రతీ జిల్లాకు ఏడీఈ స్థాయి అధికారుల పరిధిలోని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ టెస్టింగ్ కూడా పూర్తి చేశారు.

త్వరలో మరిన్ని  రైతు వేదికల్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నారు. విడతల వారిగా రాష్ట్రంలోని 2,600 రైతు వేదికలకు ఈ సేవలను విస్తరించనున్నారు. వ్యవసాయశాఖతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సైతం ఈ వేదికల ద్వారా రైతులకు సేవలను అందించనున్నారు. 

రైతులకు అందించే సేవలు ఇవే.. 

మెదటి దశలో ప్రతీ ఏడీఈ డివిజన్లో ఒక రైతు వేదిక చొప్పున వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, సైంటిస్టులు వివిధ దశల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో నేరుగా మాట్లాడి సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. పంటలకు సంబంధించిన సమస్యలు, లక్షణాలు, చీడ పీడలను సైంటిస్టులకు రైతులు వివరించవచ్చు. ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సమావేశమై ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త స్కీములపై అవగాహన కల్పించనున్నారు. వివిధ శాఖల మంత్రులు నేరుగా రైతులతో మాట్లాడి ఆలోచనలు షేర్ చేసుకునేందుకూ వీలు కల్పించనున్నారు. రైతులు తమ సమస్యలను నేరుగా వినిపించేందుకు కూడా వీలు కానుంది.