39 మందికి ఒకే సిరంజీతో వ్యాక్సిన్ వేసిన వ్యక్తి అరెస్ట్

39 మందికి ఒకే సిరంజీతో వ్యాక్సిన్ వేసిన వ్యక్తి అరెస్ట్

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఒకే సిరంజీతో 39 మంది విద్యార్థులకు కొవిడ్‌ టీకాలు వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్‌ నగరంలో జైన్‌ పబ్లిక్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో ఈనెల 27న మెగా వ్యాక్సినేషన్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో టీకాలు వేసేందుకు జితేంద్ర అహిర్వార్ అనే వ్యక్తి 15 ఏళ్లు పైబడిన 39 మందికి ఒకే సిరంజీతో టీకాలు వేశాడు. వీరంతా 9 నుంచి 12 తరగతులకు చెందినవారే.

ఇంటికెళ్లిన పిల్లలు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా అక్కడికి వచ్చి జితేంద్రను నిలదీశారు. ఒకే సిరంజీ ఎందుకు ఉపయోగించావని ప్రశ్నించగా.. డిపార్ట్ మెంట్ హెడ్ ఒకే సిరంజీ పంపాడని, దానితోనే అందరికీ వ్యాక్సిన్ వేయాలని ఆదేశించినట్లు చెప్పాడు. ఒకే సిరంజీని ఉపయోగించొద్దన్న విషయం తెలిసినా పై అధికారి చెప్పడంతోనే అలా చేశానని, అందులో తన తప్పేంలేదని బుకాయించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా జితేంద్ర అహిర్ వార్ ను అరెస్ట్ చేశారు. 

39 మంది విద్యార్థులకు ఒకే సిరంజీ ఉపయోగించిన విషయం తెలిసిన సాగర్ జిల్లా అధికారులు వ్యాక్సినేటర్ జితేంద్రపై చర్యలు తీసుకున్నారు. వన్ నీడిల్, వన్ సిరంజీ, వన్ టైమ్ విధానాన్ని ఉల్లంఘించినందుకుగానూ అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జితేంద్రతో పాటు వ్యాక్సిన్, ఇతర మెటీరియల్ పంపించే జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రాకేశ్ రోషన్‌పైనా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు.