న్యూయార్క్ కంపెనీ ఇంటర్న్షిప్ ఆఫర్
ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ నెటిజన్
మామూలుగైతే పని చేసినోళ్లకు పైసలిస్తుంటరు. బాగా చేసే వాళ్లయితే ఎక్కువ పైసలిచ్చి మరీ పని చేయించుకుంటరు. కానీ ఓ కంపెనీ మాత్రం పని చేయాలంటే ఉద్యోగులే పైసలియ్యాలంటోంది. గంటకింత చొప్పున కట్టాలంటోంది. పైగా ఆ పని కోసం యాడ్ కూడా ఇచ్చింది. ఇంతకీ విషయమేంటంటే.. డేటా ఎనలిస్టు ఇంటర్న్షిప్ కోసం ఓ వ్యక్తి ఇండీడ్ వెబ్సైట్లో వెతికాడు. న్యూయార్క్కు చెందిన ఓ కంపెనీ జాబ్ ఆఫర్ను చూశాడు. తమ కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తే రకరకాల డేటా ఎనాలసిస్ ప్రాజెక్టులు చేయొచ్చని.. ప్రోగ్రామింగ్ స్కిల్స్, పని ఒత్తిడిని అధిగమించే నైపుణ్యం పెరుగుతాయని సదరు కంపెనీ సైట్లో పోస్టు చేసింది.
అయితే ఇది రివర్స్ ఫైనాన్స్డ్ ఇంటర్న్షిప్ అని, దీని కోసం గంటకు రూ. వెయ్యి కట్టాలని చెప్పింది. ఇదే విషయాన్ని ఆ వ్యక్తి ట్విట్టర్లో పోస్టు చేశాడు. స్క్రీన్షాట్లు తీసి మరీ పెట్టాడు. ఇంకేముంది.. మస్తు వైరలైంది. 86 వేల లైకులొచ్చాయి. కొందరు నెటిజన్లు ఇలాంటి ఆఫరిచ్చిన కంపెనీ పేరును కనిపెట్టేశారు. దాని పేరు ‘ఎయ్సెలె అండ్ స్టెర్న్’ అని కామెంట్లు చేశారు. ఇండీడ్ వెబ్సైట్ కూడా ఈ విషయాన్ని కన్ఫమ్ చేసింది. ఆ కంపెనీ పోస్టును తీసేశామని, దీనిపై విచారణ జరుగుతోందని పేర్కొంది.