ఉక్రెయిన్ పై రష్యా సైనికచర్యను ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. పుతిన్ తీరును విమర్శిస్తూ ఇప్పటికే పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ కోవలోకి తాజాగా సింగపూర్ చేరింది. రష్యన్ సెంట్రల్ బ్యాంకుతోపాటు ఆ దేశానికి చెందిన మరికొన్ని బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలపై పరిమితి విధిస్తామని సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా ఎగుమతుల పైనా నియంత్రణ విధిస్తామని ప్రకటించింది. అలాగే యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు, ప్రమాదకరమైన సైబర్ కార్యకలాపాలకు వినియోగించే వస్తువులను ఇకపై రష్యాకు ఎగుమతి చేయబోమని సింగపూర్ స్పష్టం చేసింది. వాటిపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నామని తేల్చిచెప్పింది. సైనికులు ఉపయోగించే వస్తువులు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లతోపాటు రష్యాకు తాము పంపే పలు దిగుమతులపై బ్యాన్ వేస్తున్నామని పేర్కొంది. దీంతో గతంలో సింగపూర్, రష్యా చేసుకున్న పరస్పర ఒప్పందాలకు ఇప్పుడు బ్రేక్ పడింది.
Singapore will impose sanctions and restrictions against Russia in response to its invasion of Ukraine.
— MFAsg (@MFAsg) March 5, 2022
Read more here: https://t.co/YocGAWn8FA
ఇకపోతే, రష్యాను వ్యతిరేకిస్తూ పలు పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలతో మాస్కో ప్రజలకు సెగ ఆరంభమైంది. రష్యాలోని ఏటీఎంల నుంచి డబ్బులు రావడం లేదు. అక్కడ చెల్లింపు వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఆర్థిక ప్రభావం సూపర్ మార్కెట్ల పైనా పడింది. దీంతో ఒక్కోవ్యక్తి పరిమితంగానే నిత్యావసరాలను కొనుక్కోవాల్సి వస్తోంది. దుకాణాదారులు పెద్ద మొత్తాల్లో సరుకులను విక్రయించే పరిస్థితి లేదు. నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు 30 నుంచి 40 శాతం మేర పెరిగాయని డెలివరీ సర్వీసులు అందించే సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు యుద్ధం పేరు చెప్పి పలు సంస్థలు ఉద్యోగులకు లే ఆఫ్ లు వేస్తున్నాయని.. జీతాల, పింఛన్ల చెల్లింపులనూ జాప్యం చేస్తున్నాయని సమాచారం.
మరిన్ని వార్తల కోసం: