- 14 స్థానాల్లో జాబితా పెండింగ్మళ్లీ రాజాసింగ్కే గోషామహల్ టికెట్
- ఖైరతాబాద్లో మరోసారి చింతల రామచంద్రారెడ్డికి అవకాశం
హైదరాబాద్, వెలుగు: ఆదివారం బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కాగా.. గ్రేటర్లోని 25 సెగ్మెంట్లలో 11 చోట్ల మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఆశావహులు ఎక్కువగా ఉన్న సీట్లను పెండింగ్లో పెట్టింది. 2020లో జరిగిన జీహెచ్ంఎసీ ఎన్నికల్లో ఎల్బీనగర్ సెగ్మెంట్లోని అన్ని డివిజన్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, ఆ స్థానానికి కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ను ప్రకటించలేదు. గోషామహల్లో రాజాసింగ్కి బదులుగా వేరే వాళ్లకు టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు ఫస్ట్ లిస్ట్లోనే రాజాసింగ్ పేరును ప్రకటించింది. దీంతో మొన్నటి వరకు జరిగిన చర్చకు బ్రేక్ పడింది. ఇక ఖైరతాబాద్, మహేశ్వరం టికెట్లను చాలా మంది ఆశించారు. ఖైరతాబాద్ సెగ్మెంట్లో పల్లపు గోవర్ధన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించడంతో పాటు ఫ్లెక్లీలు ఏర్పాటు చేయడం, యువతతో కలిసి సమస్యలపై పోరాడారు. టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, బీజేపీ అధిష్టానం సీనియర్ నేత అయిన చింతల రామచంద్రారెడ్డి టికెట్ను కేటాయించింది. ఖైరతాబాద్ నుంచి పోటీ చేసేందుకు మూడోసారి ఆయనకు అవకాశం ఇచ్చింది. 2014లో బీజేపీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన చింతల.. 2018లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మహేశ్వరం సెగ్మెంట్లో కొంతకాలంగా మంత్రి సబితపై తీవ్ర విమర్శలు చేస్తూ టికెట్ తనదేనంటూ ప్రజల్లో తిరిగిన సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణికి నిరాశే ఎదురైంది. ఇక్కడ అందెల శ్రీ రాములు టికెట్ను కేటాయించింది. వీరితో పాటు కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలం గౌడ్, ఇబ్రహీంపట్నం నుంచి దయానంద్ గౌడ్, కార్వాన్ నుంచి అమర్ సింగ్, చార్మినార్ నుంచి మేఘారాణి, చాంద్రాయణగుట్ట నుంచి సత్యనారాయణ, యాకత్పురా నుంచి వీరేందర్ యాదవ్, బహదూర్పురా నుంచి నరేశ్ కుమార్, పటాన్చెరు నుంచి నందీశ్వర్ గౌడ్కు టికెట్లు దక్కాయి.
ఆ సెగ్మెంట్ నుంచి 10 మంది ఆశావహులు
అంబర్పేట, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, సనత్నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్పేట, నాంపల్లి, మల్కాజిగిరి, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ సెగ్మెంట్లలో బీజేపీ క్యాండిడేట్లను జాబితాను పెండింగ్లో పెట్టారు. ఈ స్థానాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై స్క్రీనింగ్ జరుగుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఎల్బీనగర్ టికెట్ను 10 మంది ఆశిస్తున్నట్లు సమాచారం. వీరిలో మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, చంపాపేట కార్పొరేటర్ వంగ మధూసూదన్, సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఉన్నారు. సామ రంగారెడ్డి సైతం టికెట్ రేసులో ఉన్నారు. ఇలా టికెట్లు ప్రకటించని స్థానాల్లో ఒక్కో చోట నలుగురు, ఐదుగురు ఆశావహులు ఉండటంతో ఆ సెగ్మెంట్లను పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆశావహులతో మరోసారి చర్చించిన తర్వాత ఈ స్థానాల్లో టికెట్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
కేడర్తో చర్చలు
తమకు టికెట్ దక్కదని భావించిన నేతలు ఇతర పార్టీల్లోకి మారేందుకు సిద్ధమవుతూ.. ముందుగానే తమ కేడర్తో చర్చలు జరుపుతున్నారు. టికెట్ రాకపోతే ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొందరు అనుకుంటుండగా, మరికొందరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే తమ సత్తాను చూపించవచ్చో ఇప్పుడే ఆలోచన చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత సిటీలో బీజేపీ పుంజుకోవడంతో ఈసారి అన్ని స్థానాల్లో ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. గతంలో ఇద్దరు, ముగ్గురు ఆశించినప్పటికీ ఈసారి పదుల సంఖ్యలో టికెట్లను ఆశిస్తున్నారు. ఆశావహులు ఎక్కువైతే అది మిగతా వారికి నష్టం కలిగించే అవకాశం ఉండటంతో అందరికి సర్దిచెప్పిన తర్వాతనే అభ్యర్థులను పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.