మునుగోడులో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి

మునుగోడులో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి
  • అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చేరికలతో టెన్షన్​
  • ఎవరు ఏపార్టీ కోసం పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి
  • ఫోన్లు ట్యాప్ చేస్తారనే అనుమానంతో వాట్సాప్ కాల్స్
  • గ్రామాలను జల్లెడ పడ్తున్న పోలీస్, ఇంటెలిజెన్స్ టీమ్స్

నల్గొండ, వెలుగు: మునుగోడు ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు కోవర్టుల భయం పట్టుకున్నది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సెకండ్​ క్యాడర్​ లీడర్లు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పార్టీలు మారుతుండడంతో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉన్నది. నమ్మి ఏదైనా చెప్తే తమ వ్యూహాలను ప్రత్యర్థి లీడర్లకు ఎక్కడ  చేరవేస్తారోననే టెన్షన్ ​పట్టుకున్నది.  ఫోన్​లో మాట్లాడితే రికార్డ్​ చేసి లీక్​ చేస్తారేమోననే అనుమానాలు వెంటాడుతున్నాయి. దీంతో రెగ్యులర్​ కాల్స్​ బంద్​ పెట్టి, వాట్సప్ ​కాల్స్ ​మాత్రమే మాట్లాడుతున్నారు.  

బూర పార్టీ మారాక సీన్​ రివర్స్​

మునుగోడులో ఓటర్​ నాడిపై రూలింగ్ ​పార్టీ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్, సర్వే రిపోర్టులు తెప్పించుకుంటోంది. దసరా ముందు దాకా మునుగోడులో బీజేపీ కంటే టీఆర్ఎస్ కే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని రిపోర్ట్​లు వచ్చాయి. అభ్యర్థిగా ప్రభాకర్​రెడ్డి పేరును ప్రకటించాక,  టీఆర్ఎస్​, బీజేపీ మధ్య ఓట్ల గ్యాప్ కొంత తగ్గిందని, 7 శాతానికి పడిపోయిందని వెల్లడైంది. ఇటీవల మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారిన తర్వాత పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారాయని టీఆర్​ఎస్​ హైకమాండ్​కు నివేదికలు అందాయి. ప్రభాకర్​రెడ్డి పేరును ప్రకటించాక మంత్రి కేటీఆర్ చర్చలతో అసంతృప్తులు చల్లబడ్డాయని అంతా భావించారు. కానీ బూర నర్సయ్య పార్టీ మారి టీఆర్ఎస్​ హైకమాండ్​కు షాక్​ ఇచ్చారు. దీంతో రూలింగ్​ పార్టీ ఒక్కసారిగా అలర్ట్​ అయ్యింది. అసంతృప్తులతో పాటు బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల నుంచి టీఆర్ఎస్​లోకి వచ్చిన సెకండ్​ క్యాడర్​పైనా నిఘా పెట్టాలని ఆదేశాలు వచ్చాయి. ప్రచారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల వెంట తిరుగుతున్నవాళ్లలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన కోవర్డులు ఉండవచ్చని, అందువల్ల పార్టీ వ్యూహాలేవీ పదిమందిలో మాట్లావద్దని హితోపదేశం చేసింది. దీంతో ఇన్​చార్జిలుగా ఉన్న ప్రజాప్రతినిధులంతా తమ వెంట ఉన్న లీడర్లను పూర్తిస్థాయిలో నమ్మడం లేదు. అడపాదడపా వాయిస్​ రికార్డులు కూడా బయటకు వస్తుండడంతో వాట్సాప్​ కాల్స్​లో మాత్రమే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా స్థానిక నేతలను నమ్మకుండా తాము వెంట తెచ్చుకున్న అనుచరులకే అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్​లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. టీఆర్ఎస్​ నుంచి వచ్చిన లీడర్లలో కొందరు కోవర్టులు ఉన్నారనే అనుమానాలతో పార్టీ వ్యూహాలను, కీలకమైన నిర్ణయాలను గుట్టుగా తీసుకుంటున్నట్లు తెలిసింది. 

ఇంటెలిజెన్స్​ నిఘా.. 

టీఆర్ఎస్​లో ఉంటూ ప్రత్యర్థులకు ఉప్పందిస్తున్న కోవర్టులపై రూలింగ్​ పార్టీ సీరియస్​గా దృష్టి పెట్టింది. ఇందుకోసం పోలీస్, ఇంటెలిజెన్స్ టీమ్​లను వాడుకుంటోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో వేసిన సీఐలు, ఎస్​ఐలు, కింది స్థాయి పోలీసులు, ఇంటెలిజెన్స్​ అధికారులు గ్రామాలను జల్లెడ పడ్తున్నారు. సివిల్​ డ్రెస్​లలో ఉన్న కొందరు సాధారణ ప్రజల్లాగే తిరుగుతూ ప్రజల నాడిని, నాయకులు, కోవర్టుల సమాచారాన్ని రాబట్టి, హైకమాండ్​కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. ఎంత కట్టుదిట్టం చేస్తున్నా  ఫోన్ల ద్వారా ప్రత్యర్థులకు సమాచారం చేరవేస్తున్నట్లు ఇంటెలిజెన్స్​టీమ్​లు బయటపెట్టడంతో సొంత పార్టీలోని కొందరి ఫోన్లను కూడా రూలింగ్​ పార్టీ ట్యాపింగ్​ చేయిస్తోందనే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు, వారి ఫోన్లపై నిఘా పెడ్తే తప్పులేదుగానీ, సొంత పార్టీ లీడర్లపైనే నిఘా పెట్టడం ఏమిటనే చర్చ జరుగుతోంది.