బద్రీనాథ్‌ రోడ్డు మూసివేత.. చార్‌ధామ్‌ యాత్రకు ఆటంకం

బద్రీనాథ్‌ రోడ్డు మూసివేత.. చార్‌ధామ్‌ యాత్రకు ఆటంకం

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు బద్రీనాథ్‌ హైవేపై పడిపోయాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన్ని మూసివేశారు. పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ప్రకారం ఈ ఏడాది 7.60 లక్షల మంది పర్యాటకులు బద్రీనాథ్‌ను సందర్శించారు. మే 8వ తేదీన బద్రీనాథ్‌ యాత్ర ప్రారంభమైంది. రోడ్డు మూతపడడంతో యాత్రకు ఆటంకం కలుగుతోంది. పలు ప్రాంతాల్లో భక్తులు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి బద్రీనాథ్‌ను సందర్శించి.. మాస్టర్‌ ప్లాన్‌ కింద చేపట్టిన పునరాభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టుల్లో రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, అరైవల్ ప్లాజా నిర్మాణం, దేవాలయం సమీపంలోని సరస్సుల సుందరీకరణ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ద్వారా లూప్ రోడ్, బైపాస్ నిర్మాణాలు ఉన్నాయి. పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడకుండా నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఆదేశించారు.