
- మరో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ గిల్
- రెండో టెస్టులో గెలుపు ముంగిట ఇండియా
- రెండో ఇన్నింగ్స్లో 427/6 డిక్లేర్డ్
- 608 రన్స్ టార్గెట్ ఛేజింగ్లో 72/3తో ఇంగ్లండ్ ఎదురీత
బర్మింగ్హామ్: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ (162 బాల్స్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) హవా నడుస్తోంది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ కొట్టిన గిల్ ఈసారి సూపర్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన వేళ ఇంగ్లండ్తో రెండో టెస్టును టీమిండియా గుప్పిట్లోకి తీసుకుంది. గిల్ జోర్దార్ ఆటకు తోడు పేసర్లు కూడా సత్తా చాటడంతో విజయానికి మరో ఏడు వికెట్ల దూరంలో నిలిచింది. ఇండియా ఇచ్చిన 608 రన్స్ భారీ టార్గెట్ ఛేజింగ్లో నాలుగో రోజు, శనివారం చివరకు ఇంగ్లిష్ టీమ్ 16 ఓవర్లలో 73/3 స్కోరుతో నిలిచింది. ఆకాశ్ దీప్ (2/36), మహ్మద్ సిరాజ్ (1/29) టాపార్డర్ను దెబ్బకొట్టారు. ఒలీ పోప్ (24 బ్యాటింగ్), హ్యారీ బ్రూక్ (15 బ్యాటింగ్)క్రీజులో ఉండగా.. చివరి రోజు ఆ టీమ్ విజయానికి536 రన్స్ అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యాచ్ గెలిచే అర్హత ఇండియాకే ఉంది. జట్టును గెలిపించే బాధ్యత బౌలర్లదే. డ్రాతో గట్టెక్కాలన్నా ఇంగ్లండ్ రోజంతా పోరాడాల్సి ఉంటుంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 64/1తో ఆట కొనసాగించిన ఇండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) ఫిఫ్టీలతో మెరిశారు.
గిల్ జోర్దార్
నాలుగో రోజు గిల్ ఆటే హైలైట్. వన్డే స్టయిల్లో తను చేసిన సెంచరీతో ఇండియా మ్యాచ్పై పూర్తి పట్టు బిగించింది. ఉదయం మేఘావృత వాతావరణంలో ఇంగ్లండ్ పేసర్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఓవర్నైట్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నాడు. బ్రైడన్ కార్స్ బౌలింగ్లో తడబడ్డ కరుణ్ నాయర్ (26) అతనికే వికెట్ ఇచ్చుకున్నాడు. మరో ఎండ్లో కొన్ని అద్భుతమైన కవర్ డ్రైవ్లతో అలరించి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రాహుల్ను టంగ్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ గిల్ తోడుగా భారీ షాట్లు ఆడిన పంత్ ఫ్యాన్స్ను అలరించాడు. వచ్చీరాగానే జోష్ టంగ్ బౌలింగ్లో ఫోర్, సిక్స్ కొట్టి తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. 177/3తో లంచ్కు వెళ్లొచ్చిన వెంటనే గిల్ (57 బాల్స్లో), పంత్ (48 బాల్స్లో) ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. కానీ, టంగ్ బౌలింగ్లో పంత్ భారీ షాట్కు ప్రయత్నించి స్మిత్కు క్యాచ్ ఇవ్వడంతో నాలుగో వికెట్కు 110 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. మరో లెఫ్టాండర్ జడేజా తోడుగా రెండో సెషన్ గిల్ గేరు మార్చి వేగాన్ని పెంచాడు. క్లాసిక్ షాట్లతో గ్రౌండ్ షాట్లు కొడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో టీ బ్రేక్కు ముందు బషీర్ బౌలింగ్లో సింగిల్ తీసి సెంచరీ (129 బాల్స్) పూర్తి చేసుకున్నాడు. 304/4తో టీ బ్రేక్కు వెళ్లొచ్చిన తర్వాత గిల్ తనలోని హిట్టర్ను నిద్రలేపాడు. ఈసారి టీ20 స్టయిల్లో భారీ షాట్లతో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్లో జడ్డూ కూడా బ్యాట్కు పని చెప్పడంతో చూస్తుండగానే స్కోరు 400 దాటింది. మరో డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన గిల్.. స్పిన్నర్ బషీర్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జడేజాతో అతను ఐదో వికెట్కు 175 రన్స్ జోడించాడు. నితీష్ రెడ్డి(1) మరోసారి ఫెయిలయ్యాడు. ఆధిక్యం 600 దాటిన వెంటనే శుభ్మన్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు.
ఆకాశ్ సూపర్
అత్యంత భారీ టార్గెట్ ఛేజింగ్కు వచ్చిన ఇంగ్లండ్ను పేస్ లీడర్ సిరాజ్ దెబ్బకొట్టాడు. రెండో ఓవర్లోనే ఓపెనర్ జాక్ క్రాలీ (0)ని డకౌట్ చేసి ఇండియాకు అదిరిపోయే ఆరంభం అందించాడు. ఆపై ఆకాశ్ దీప్ అదరగొట్టాడు. వరుస బౌండ్రీలతో వేగంగా ఆడుతున్న తొలి టెస్టు సెంచరీ హీరో బెన్ డకెట్ (25)ను బౌల్డ్ చేసి ఇంగ్లిష్ టీమ్కు షాకిచ్చాడు. కొద్దిసేపటికే సీనియర్ బ్యాటర్ జో రూట్ (6)ను బౌల్డ్ చేసి ఔరా అనిపించాడు. ఒలీ పోప్, బ్రూక్ మరో వికెట్ పడకుండా చూసుకున్నా.. నాలుగో రోజు ఆటలో ఇండియాదే పూర్తి ఆధిపత్యం అయింది.
సంక్షిప్త స్కోర్లు
- ఇండియా తొలి ఇన్నింగ్స్: 587 ఆలౌట్; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 407 ఆలౌట్; ఇండియా రెండో ఇన్నింగ్స్: 83 ఓవర్లలో 427/6 డిక్లేర్డ్ (గిల్ 161, జడేజా 69నాటౌట్, టంగ్ 2/93);
- ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ (టార్గెట్ 608): 16 ఓవర్లలో 72/3 (డకెట్ 24, పోప్ 24, ఆకాశ్ 2/36).
- 1 ఒకే టెస్టు మ్యాచ్లో సెంచరీ, డబుల్ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఇండియా తొలి జోడీగా గిల్, జడేజా నిలిచారు.
- 2 ఒకే టెస్టులో రెండుసార్లు 150 ప్లస్ స్కోర్లు చేసిన రెండో బ్యాటర్ గిల్. అలన్ బోర్డర్ (1980లో పాక్పై 150*, 153) ముందున్నాడు. గావస్కర్ తర్వాత ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన రెండో ఇండియన్గా గిల్ నిలిచాడు.
- 4 ఈ టెస్టులో ఇండియా నాలుగు సెంచరీ పార్ట్నర్షిప్స్ నెలకొల్పితే అన్నింటిలోనూ గిల్ భాగమయ్యాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ఇండియన్గా.. ఓవరాల్గా ఐదో బ్యాటర్గా నిలిచాడు.
- 430 ఈ మ్యాచ్లో గిల్ చేసిన రన్స్. ఒక టెస్టులో ఇండియా తరఫున అత్యధికం. 1971లో వెస్టిండీస్పై సునీల్ గావస్కర్ సాధించిన 344 పరుగుల రికార్డును గిల్ అధిగమించాడు.
- 585 ఈ సిరీస్ రెండు మ్యాచ్ల్లో గిల్ చేసిన రన్స్. ఇండియా కెప్టెన్గా తొలి రెండు టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ (449) రికార్డు బద్దలు కొట్టాడు.
- 1014 ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి ఇండియా సాధించిన మొత్తం రన్స్. దాంతో తమ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఒక మ్యాచ్లో వెయ్యి రన్స్ చేసింది. 2004లో సిడ్నీలో ఆస్ట్రేలియాపై చేసిన 916 రన్స్ రికార్డు బ్రేక్ అయింది.