IND vs IRE 2nd T20I: రెండో టీ20లో టీమిండియా ఘన విజయం.. సిరీస్ మనదే

IND vs IRE 2nd T20I: రెండో టీ20లో టీమిండియా ఘన విజయం.. సిరీస్ మనదే

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటర్లు చెలరేగగా.. ఆపై బౌలర్లు కూడా రాణించడంతో మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్ చేజిక్కించుకుంది. భారత్ నిర్ధేశించిన 186 పరుగుల లక్ష్య చేధనలో ఐర్లాండ్ 152 పరుగులకే పరిమితమైంది. 

 మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్ (58; 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీ చేయగా.. సంజూ శాంసన్ (40; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), రింకూ సింగ్ (38; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), శివమ్ దూబే (22 నాటౌట్; 16 బంతుల్లో 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మెకర్థీ 2 వికెట్లు తీసుకోగా.. మార్క్‌ అడైర్‌, క్రెయిగ్ యంగ్, బెంజమిన్‌ వైట్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం 186 పరుగుల లక్ష్య చేధనలో ఐర్లాండ్ 152 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు ఓపెనర్  ఆండ్రూ బల్బిర్నీ(72; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ వచ్చిన భారత బౌలర్లు.. ఐరిష్ బ్యాటర్లకు ఏ  చిన్న అవకాశం ఇవ్వలేదు. నిర్ణీత ఓవర్లలో 152 పరుగులు చేసిన ఐర్లాండ్.. 33 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ క్రిష్ణ, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీసుకోగా.. అర్షదీప్ ఒక వికెట్ పడగొట్టాడు.