ఇవాళ్టి నుంచి విండీస్‌‌‌‌-టీమిండియా సెకండ్ టెస్టు

ఇవాళ్టి నుంచి విండీస్‌‌‌‌-టీమిండియా  సెకండ్ టెస్టు

పోర్ట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ స్పెయిన్‌‌‌‌:  టీమిండియా, వెస్టిండీస్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ జట్ల మధ్య టెస్టు సమరం సరికొత్త మైలురాయిని చేరనుంది. రెండు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో భాగంగా గురువారం ఇక్కడి క్వీన్స్​ పార్క్​ఓవల్​లో జరిగే  రెండో, చివరి టెస్టు ఈ ఫార్మాట్‌‌‌‌లో ఇండియా, విండీస్‌‌‌‌ మధ్య వందో టెస్టు కానుంది. మొదటి మ్యాచ్‌‌‌‌ జోష్‌‌‌‌ను కొనసాగిస్తూ ఈ హిస్టారికల్‌‌‌‌ టెస్టులోనూ  గెలిచి సిరీస్‌‌‌‌ను క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేయాలని రోహిత్‌‌‌‌ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా ఆశిస్తోంది. కనీసం ఈ పోరులో అయినా నెగ్గాలని ఆతిథ్య కరీబియన్లు బలంగా కోరుకుంటున్నారు. కానీ, అది జరగాలంటే వాళ్లు అద్భుతం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డొమినికాలో ఫస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో రోహిత్‌‌‌‌సేనకు కరీబియన్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. రెండు ఇన్నింగ్స్‌‌‌‌ల్లోనూ బ్యాటింగ్‌‌‌‌లో కుప్పకూలి మూడ్రోజుల్లోనే చిత్తయింది. కెరీర్‌‌‌‌లో తొలి మ్యాచ్‌‌‌‌ ఆడిన టీమిండియా ఓపెనర్‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌ ఒక్కడే  171 రన్స్‌‌‌‌తో భారీ సెంచరీ కొట్టేస్తే.. ఆతిథ్య జట్టులో 11 మంది కలిసి రెండు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో కనీసం ఆ మార్కును కూడా అందుకోలేకపోయారు. కాస్త బలంగా ఉందనుకున్న ఆ టీమ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ యూనిట్‌‌‌‌ కూడా తొలి పోరులో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియాకు కనీసం పోటీ ఇవ్వాలన్నా కరీబియన్లు సమష్టిగా ఆడాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ మ్యాచ్‌‌‌‌ కూడా మూడ్రోజుల్లోనే ముగిసినా ఆశ్చర్యం లేదు.

రహానెపై ఫోకస్‌‌‌‌

ఈ మ్యాచ్‌‌‌‌ తర్వాత ఆసియా కప్‌‌‌‌, వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌ పెట్టనున్న టీమిండియా మళ్లీ డిసెంబర్‌‌‌‌–జనవరిలో సౌతాఫ్రికాలో తమ  తదుపరి టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో  సఫారీ టూర్‌‌‌‌కు వెళ్లే టెస్టు జట్టులో చోటు కాపాడుకునేందుకు సీనియర్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ రహానెకు ఈ మ్యాచ్‌‌‌‌ మరో అవకాశం కానుంది. దాంతో, అతనిపై ఫోకస్‌‌‌‌ ఉండనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆకట్టుకున్న రహానె తొలి టెస్టులో నిరాశ పరిచాడు. గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ సౌతాఫ్రికా టూర్‌‌‌‌కు పోటీలోకి రానున్న నేపథ్యంలో అజింక్యా ఈ  పోరులో మంచి ఇన్నింగ్స్‌‌‌‌ ఆడితే తన కాన్ఫిడెన్స్‌‌‌‌ పెరగడంతో పాటు సెలెక్టర్లకు కూడా అతనిపై నమ్మకం కలగనుంది. ఇక తన ఫస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లోనే భారీ సెంచరీతో ఆకట్టుకున్న యశస్వి అదే జోరు కొనసాగించాలని ఆశిస్తుండగా.. డొమినికాలో 11 బాల్స్‌‌‌‌ మాత్రమే ఆడి ఔటైన శుభ్‌‌‌‌ మన్‌‌‌‌ గిల్‌‌‌‌ ఈ పోరులో సత్తా చాటాలనిచూస్తున్నాడు. 2018 డిసెంబర్‌‌‌‌ తర్వాత టెస్టుల్లో సెంచరీ చేయని కోహ్లీ ఈ మ్యాచ్‌‌‌‌లో  వంద కొడితే చూడాలని ఫ్యాన్స్‌‌‌‌ ఆశిస్తున్నారు. ఇక, తన డెబ్యూ టెస్టులో  ఖాతా తెరిచేందుకు 20 బాల్స్‌‌‌‌ ఎదుర్కొన్న కీపర్‌‌‌‌ ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ కూడా బ్యాట్‌‌‌‌ ఝుళిపించాలని ఆత్రుతగా ఉన్నాడు. తొలి మ్యాచ్‌‌‌‌లో భారీ విజయం సాధించిన నేపథ్యంలో దాదాపు అదే జట్టును కొనసాగించే చాన్సుంది. రెండో టెస్టులోనూ పిచ్‌‌‌‌ స్పిన్‌‌‌‌కు అనుకూలించేలా ఉండటంతో  వెస్టిండీస్ తమ బ్యాటింగ్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ రేమన్‌‌‌‌ రీఫర్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో స్పిన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ కెవిన్‌‌‌‌ సింక్లైర్‌‌‌‌ను తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూడా  జైదేవ్‌‌‌‌ ఉనాద్కట్‌‌‌‌, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌లో ఒకరిని తప్పించి అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ను తీసుకునే అవకాశం లేకపోలేదు.