
- ఇంటర్న్షిప్ పేరుతో హైదరాబాద్ కు రప్పించి
- మరొకరితో కలిసి అత్యాచారం చేసిన ఫ్రెండ్
జీడిమెట్ల, వెలుగు: బయోమెడికల్ ఫైనలియర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆమె స్నేహితుడు మరో వ్యక్తితో కలిసి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడు. ఈ ఘటన సిటీలోని బాచుపల్లిలో జరిగింది. జార్ఖండ్కు చెందిన బాధితురాలు (20) చెన్నైలోని ఓ కాలేజీలో బయోమెడికల్ చివరి సంవత్సరం చదువుతోంది. బాచుపల్లికి అజయ్(24) కూడా అదే కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. దీంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. బయోమెడికల్ కోర్సు పూర్తవుతుండడంతో హైదరాబాద్లో ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని బాధితురాలిని అజయ్ నమ్మించాడు.
దీంతో యువతి ఈ నెల 3న హైదరాబాద్ వచ్చింది. ఆమెను అజయ్ తన బైక్పై ఎక్కించుకుని కేపీహెచ్బీలోని హాస్టల్కు తీసుకెళ్లాడు. సాయంత్రం పార్టీ చేసుకుందామని నిజాంపేటలోని రాజీవ్ గృహకల్పలో ఓ రూమ్కు తీసుకెళ్లాడు. యువతికి అజయ్, అతని స్నేహితుడు హరి (25) మద్యం తాగించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అజయ్, అతని ఫ్రెండ్ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు.