ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మువ్వన్నెల జెండా రెపరెపలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మువ్వన్నెల జెండా రెపరెపలు

నెట్​వర్క్​, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా మువ్వన్నెల జెండా రెపరెపలతో మెరిసిపోయింది.  వాడవాడలా స్వాతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి.  నిజామాబాద్​లో బీసీ కమిషన్​ చైర్మన్​ నిరంజన్​, కామారెడ్డిలో రైతు కమిషన్​ చైర్మన్​ కోదండరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించి అధికారికవేడుకల్లో జిల్లా ప్రగతిని నివేదించారు.       

ప్రగతిపథంలో కామారెడ్డి :  ​ కోదండరెడ్డి

 కామారెడ్డి జిల్లా ప్రగతిపథంలో ముందుకెళ్తోందని రాష్ర్ట వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్​ చైర్మన్​ ఎం.కోదండరెడ్డి అన్నారు.   శుక్రవారం కామారెడ్డిలోని  ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో  ఆయన మాట్లాడారు. రేషన్​ కార్డుల పంపిణీ ద్వారా  ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు భరోసా కల్పించిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా,  సన్న బియ్యం , మహాలక్ష్మీ వంటి స్కీమ్​ల ద్వారా పేదలకు మేలు కలిగిందన్నారు.  

స్థానిక సంస్థల్లో బీసీలకు  42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం బిల్లు తెచ్చిందని గుర్తుచేశారు. జిల్లాలో కొత్తగా 15,302 మందికి తెల్ల రేషన్​ కార్డులిచ్చామన్నారు.  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల  జిల్లాలో  రూ. 167 కోట్ల మేర లబ్ధిచేకూరిందన్నారు. 11,818 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్​ అయ్యాయన్నారు. భూ భారతి సదస్సుల ద్వారా రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు శకటాలను ప్రదర్శిచాయి. ఉత్తమ సేవలందించిన వారికి కోదండరెడ్డి ప్రశంసాపత్రాలు అందించారు. 

సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం : నిరంజన్​

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని,   ప్రతి పౌరుడికి  కూడు, గూడు, గుడ్డకు ప్రభుత్వం భరోసా ఇస్తోందని  బీసీ కమిషన్​చైర్మన్​ నిరంజన్​ అన్నారు. శుక్రవారం నిజామాబాద్​ పోలీస్ పరేడ్​ గ్రౌండ్​లో జరిగిన స్వాతంత్ర్య  వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.  రేషన్​ కార్డులకు సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా పేదలు  ఆత్మగౌరవంతో జీవించేలా చేసిందన్నారు.  జిల్లాలో 4,03,510 రేషన్​ కార్డులున్నాయన్నారు.  

రూ.22,500 కోట్లతో  ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని,   జిల్లాలో మహిళలకు రూ. 30.73 కోట్ల మేరకు వంటగ్యాస్​ సబ్సిడీ ఇచ్చామన్నారు.   గృహజ్యోతి స్కీమ్​కింద ఉచిత విద్యుత్​ పథకం కింద  రూ.165 కోట్ల లబ్ది చేకూరిందన్నారు.ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను సన్మానించారు.  స్టూడెంట్స్​ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ​ఆకట్టుకున్నాయి. కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ, భూపతిరెడ్డి, పైడి రాకేశ్​ రెడ్డి, కార్పొరేషన్​ చైర్మన్​ మానాల మోహన్​రెడ్డి, వ్యవసాయ కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్​ తదితరులు ఉన్నారు.