
ఐండ్హోవెన్ (నెదర్లాండ్స్): యూరోప్ టూర్లో ఇండియా–ఎ మెన్స్ హాకీ జట్టు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. శనివారం జరిగిన మూడో మ్యాచ్లోనూ ఇండియా 3–2తో ఫ్రాన్స్పై గెలిచింది. ఫార్వర్డ్ ప్లేయర్ ఆదిత్య అర్జున్ లాల్గే రెండు గోల్స్, బాబీ సింగ్ ధామి ఒక గోల్ చేశాడు. ఫ్రాన్స్ తరఫున క్లైమెంట్ రెండు ఫీల్డ్ గోల్స్ కొట్టాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇండియా కీలక టైమ్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది.
ఈ క్రమంలో ఒక ఫీల్డ్ గోల్ కొట్టిన ఆదిత్య మరో పెనాల్టీని గోల్గా మలిచాడు. ‘ఈ టూర్లో మేం మరికొన్ని మ్యాచ్ల్లో రాణించాల్సి ఉంది. ఇదే జోరును కొనసాగిస్తామని ఆశిస్తున్నాం’ అని ఇండియా కోచ్ శివేంద్ర సింగ్ అన్నాడు. ఈ టూర్లో ఇండియా ఇంకా ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఫ్రాన్స్తో జరిగే రివర్స్ మ్యాచ్తో పాటు నెదర్లాండ్స్తో రెండు, ఇంగ్లండ్, బెల్జియంతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది.