
- ఇండియా–ఎ 319/7
- రాణించిన జురెల్, నాయర్
నార్తాంప్టన్: ఐపీఎల్–18లో రాణించిన టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (168 బాల్స్లో 15 ఫోర్లు, 1 సిక్స్తో 116).. టెస్ట్ ఫార్మాట్లోనూ ఆకట్టుకున్నాడు. మెగా లీగ్ను ముందుగానే ముగించుకుని ఇంగ్లండ్ చేరుకున్న కేఎల్.. ఇంగ్లండ్ లయన్స్తో శుక్రవారం ప్రారంభమైన రెండో అనధికార టెస్ట్ మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా–ఎ తొలి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 319/7 స్కోరు చేసింది. ఆట ముగిసే టైమ్కు తనుష్ కొటియాన్ (0 బ్యాటింగ్), అన్షుల్ కాంబోజ్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
వోక్స్ అదుర్స్..
ఇండియాతో తొలి టెస్ట్ ఆడే ఇంగ్లండ్ టీమ్లో చోటు దక్కించుకున్న పేసర్ క్రిస్ వోక్స్ (3/50) ఈ మ్యాచ్లో దుమ్మురేపాడు. ఓపెనర్గా వచ్చిన రాహుల్ నిలకడగా ఆడినా.. రెండో ఎండ్లో వోక్స్ 7, 11వ ఓవర్లలో యశస్వి జైస్వాల్ (17), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (11)ను ఔట్ చేసి షాకిచ్చాడు. దాంతో 40/2తో కష్టాల్లో పడిన ఇండియా ఇన్నింగ్స్ను రాహుల్తో కలిసి కరుణ్ నాయర్ (71 బాల్స్లో 4 ఫోర్లతో 40) నిలబెట్టాడు. జార్జ్ హిల్ (2/56), ఫర్హాన్ అహ్మద్ (1/37) కూడా స్వింగ్తో భయపెట్టినా ఈ ఇద్దరు దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రాహుల్ 102 బాల్స్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు.
అయితే 44వ ఓవర్లో వోక్స్ అద్భుతమైన ఇన్స్వింగ్తో నాయర్ను ఎల్బీ చేయడంతో మూడో వికెట్కు 86 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన ధ్రువ్ జురెల్ (87 బాల్స్లో 7 ఫోర్లతో 52) నిలకడగా పరుగులు రాబట్టాడు. భారీ షాట్లకు పోకుండా టెక్నికల్ గేమ్తో ముందుకెళ్లాడు. ఈ ఇద్దరి నిలకడతో ఇండియా 213/3తో టీ బ్రేక్కు వెళ్లింది. మూడో సెషన్ స్టార్ట్ కాగానే జురెల్ 66 బాల్స్లోనే ఫిఫ్టీ, రాహుల్ 151 బాల్స్లో సెంచరీ సాధించారు. చివరకు రెండు ఓవర్ల తేడాలో ఈ ఇద్దరూ వెనుదిరగడంతో నాలుగో వికెట్కు 121 రన్స్ జతయ్యాయి. ఈ రెండు వికెట్లు హిల్ ఖాతాలోకి వెళ్లాయి. వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం కలిగినా.. నితీశ్ రెడ్డి (34) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. శార్దూల్ (19)తో ఆరో వికెట్కు 33, తనుష్తో ఏడో వికెట్కు 29 రన్స్ జోడించడంతో స్కోరు మూడొందలు దాటింది. తర్వాత వచ్చిన కాంబోజ్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.