- భారీ స్కోర్లపై సుదర్శన్ దృష్టి
బెంగళూరు: గాయంతో మూడు నెలల పాటు ఇంటర్నేషనల్ క్రికెట్కు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్.. రీ ఎంట్రీపై దృష్టి పెట్టాడు. ఈ నేపథ్యంలో రెండు టెస్ట్ల అనధికార సిరీస్లో భాగంగా గురువారం నుంచి సౌతాఫ్రికా–ఎతో జరిగే తొలి (నాలుగు రోజుల) మ్యాచ్లో ఇండియా–ఎ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ సందర్భంగా పంత్ పాదానికి గాయమైన సంగతి తెలిసిందే. దాంతో వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్కు దూరమయ్యాడు. దాంతో పంత్ ఫామ్పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు.
ఇప్పటికే ధ్రువ్ జురెల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో గాడిలో పడాలని ఈ ఢిల్లీ బ్యాటర్ భావిస్తున్నాడు. ప్రస్తుతం సీవోఈలో ప్రాక్టీస్ చేస్తున్న పంత్కు వర్షం వల్ల పెద్దగా ప్రాక్టీస్ లభించడం లేదు. దీంతో నిజమైన మ్యాచ్ పరిస్థితుల్లో ఎక్కువసేపు క్రీజులో గడపాలని యోచిస్తున్నాడు. ఆఫ్ స్పిన్నర్ సుబ్రాయెన్ మినహా సౌతాఫ్రికా–ఎ బౌలర్లకు అనుభవం తక్కువ. కాబట్టి ఈ మ్యాచ్లో పంత్కు బ్యాటింగ్, వికెట్ కీపింగ్లో పుల్ ప్రాక్టీస్ లభించనుంది. ముఖ్యంగా టెస్ట్ల్లో జడేజా, కుల్దీప్ టర్నింగ్ బాల్స్ను అందుకోవడం కత్తిమీద సామే. దీన్ని అధిగమించాలంటే సారాన్ష్ జైన్, మానవ్ సుతార్, హర్ష్ దూబే వంటి సమర్థులైన స్పిన్నర్ల బృందం పంత్కు సహకరించనుంది. వెస్టిండీస్తో రెండో టెస్ట్లో ఆడిన సాయి సుదర్శన్ కూడా బ్యాటింగ్పై దృష్టి పెట్టాడు.
సౌతాఫ్రికా సిరీస్కు ముందు ఈ రెండు మ్యాచ్లు ప్రాక్టీస్కు ఉపయోగపడతాయని భావిస్తున్నాడు. గత 9 ఇన్నింగ్స్ల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు చేయడంతో భారీ స్కోర్లపై దృష్టి సారించాడు. ఇక ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, దేవదత్ పడిక్కల్, నారాయణ్ జగదీశ్ వంటి యంగ్ ప్లేయర్లు కూడా సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారు. వెస్టిండీస్తో సిరీస్లో ఉన్న పడిక్కల్, సుదర్శన్ మళ్లీ టీమిండియాలో బెర్త్ దక్కించుకోవాలని ప్లాన్స్ చేస్తున్నారు. ఖలీల్, కాంబోజ్ కూడా సెలెక్టర్ల దృష్టిలో ఉండాలని భావిస్తున్నారు. ఓవరాల్గా టీమిండియా లక్ష్యంగా కుర్రాళ్లందరూ తమ పెర్ఫామెన్స్ చూపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు దాదాపు రెండేళ్ల తర్వాత సౌతాఫ్రికా–ఎ జట్టులోకి వచ్చిన జుబేర్ హమ్జా ఆటను ప్రొటీస్ సెలెక్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. తన చివరి ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.
