- ఇథనాల్ బ్లెండింగ్పై ప్రధాని నరేంద్ర మోడీ
- పర్యావరణానికి పెద్దపీట వేస్తున్నం - ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : పెట్రోల్ను ఆదా చేయడానికి అందులో పదిశాతం ఇంథనాల్ను కలపాలన్న టార్గెట్ను గడువు కంటే ఐదు నెలల ముందే సాధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ‘సేవల్ సాయిల్ మూవ్మెంట్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పర్యావరణాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నదని చెప్పారు. వాతావరణ మార్పులో ఇండియా పాత్ర తక్కువే అయినా పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు. 2014లో ప్రభుత్వం పెట్రోల్లో రెండుశాతం ఇథనాల్ కలిపేది కాగా ఇప్పుడు ఇది పది శాతానికి చేరింది. దానివల్ల 27 లక్షల టన్నుల విషవాయువులు విడుదల కాకుండా ఆపగలిగాం. రూ.41 వేల కోట్ల విదేశీ కరెన్సీని ఆదా చేశాం. రైతులకు రూ.40 వేల కోట్లు చేతికి అందాయని మోడీ పేర్కొన్నారు. పెట్రో ఎగుమతులను తగ్గించడానికి ఇథనాల్ బ్లెండింగ్ను తప్పసరిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం 2018లో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ తెచ్చింది. బయోఇథనాల్, బయోడీజిల్ బయో సీఎన్జీ ప్రధాన ఇంధనాలను దృష్టిలో ఉంచుకుని ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ (ఈపీబీ)ను తీసుకొచ్చింది. ఇందులో రెండవ తరం ఇథనాల్ (అటవీ, వ్యవసాయ వ్యర్థాల నుండి తీస్తారు) ఉత్పత్తి కూడా చేర్చారు. దీనితో ఫ్యూయల్ యాడిటివ్స్ను తయారు చేయవచ్చు. వీటి తయారీకి విధించిన టార్గెట్లను చేరుకుంటే ఇన్సెంటివ్లు కూడా ఇస్తున్నారు.
"2025 నాటికి భారతదేశంలో ఇథనాల్ బ్లెండింగ్ కోసం రోడ్మ్యాప్పై నిపుణుల కమిటీ" విడుదల చేసిన రిపోర్టు ప్రకారం, త్వరలో 20శాతం ఇథనాల్ బ్లెండింగ్ కూడా అందుబాటులో వస్తుంది. భారతదేశంలో ‘ఈ20’ ఇథనాల్ను క్రమంగా ప్రవేశపెట్టడానికి యానువల్ ప్లాన్ను రెడీ చేశారు. 2025 నాటికి పెట్రోల్లో 20శాతం ఇథనాల్ను కలపడం, ఉత్పత్తి, సరఫరా క్రమంగా బ్లెండింగ్ను పెంచడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆటో కంపెనీలు నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఈ ప్లాన్ సూచిస్తుంది.
అభివృద్ధి చెందుతున్న దేశాలతోనే అవస్థలు
ప్రపంచ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నదే అభివృద్ధి చెందిన దేశాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచంలో కార్బన్ ఉద్గారాలు పెరిగిపోవడానికి కారణం ఆ దేశాలేనని విమర్శించారు. భూమిపై ఉన్న వనరులను విచ్చలవిడిగా దోచుకుంటున్నాయని ఆరోపించారు. ప్రపంచంలో ఒక్కో మనిషి ఏడాదికి సగటున 4 టన్నుల కర్బన ఉద్గారాలకు కారణమవుతుంటే.. మన దేశంలో మాత్రం ఆ సగటు కేవలం అరటన్ను మాత్రమేనన్నారు. దేశంలో ఎనిమిదేండ్లలో అడవులు 20 వేల చదరపు కిలోమీటర్ల మేర పెరిగాయని ప్రధాని మోడీ చెప్పారు. నదుల ఒడ్డున అడవుల పెంపకానికి చర్యలు ప్రారంభించామని, దాని వల్ల 7,400 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరుగుతుందని వివరించారు. వన్యప్రాణుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ తయారీపై పెట్టుకున్న టార్గెట్లో 9 ఏండ్ల ముందుగానే 40 శాతం మార్క్ను అందుకున్నామని చెప్పారు. సౌర విద్యుత్ సామర్థ్యం 18 రెట్లు పెరిగిందన్నారు.