అక్టోబర్లో ఇండియా కూటమి తొలి బహిరంగ సభ

అక్టోబర్లో ఇండియా కూటమి తొలి బహిరంగ సభ

ఇండియా కూటమి మొదటి సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఇండియా కూటమి సమన్వయ కమిటీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ మొదటి వారంలో మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఇండియా కూటమి తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. 

ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశానికి మొత్తం12 మంది నేతలు హాజరయ్యారు. ఈడీ  సమన్లు జారీ చేయడంతో సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ హాజరు కాలేకపోయారు. ఈ సందర్భంగా దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, కుల గణన,  బీజేపీ అవినీతి పాలన వంటి అంశాలను జనంలోకి తీసుకెళ్లడంపై దృష్టి ఇండియా కూటమి సారించింది. విపక్షాలపై కక్షపూరిత రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని కూటమి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఉమ్మడిగా ప్రచారం చేయాలని  నిర్ణయం తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించాలని.. ఈ మేరకు, భాగస్వామ్య పక్షాల చర్చలు త్వరితగతిన ప్రారంభించాలని నిర్ణయించారు. 

మరోవైపు దేశంలోని వివిధ టీవీ ఛానెల్స్ లో ఏ ఏ యాంకర్లు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో కూటమి పక్షాల నేతలు పాల్గొనరాదో .... ఆ యాంకర్ల జాబితాను రూపొందించే బాధ్యతలను "ఇండియా" కూటమి కి చెందిన మీడియా "సబ్ గ్రూప్"కు సమన్వయ కమిటీ సభ్యులు అప్పగించారు.