
ఉత్కంఠ భరితంగా సాగిన ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ కు ముందు ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆట మొదలుపెట్టే ముందు ఇరు జట్లు జాతీయ గీతాలు ఆలపించాయి. అయితే ఈ రెండు జాతీయ గీతాలను రచించింది ఒక్కరే కావడం విశేషం. జగమెరిగిన ఆ కలం యోధుడే రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశ జాతీయ గీతమైన 'జనగణమన' ను ఠాగూర్ బెంగాలీలో రాశారు. బంగ్లాదేశ్ జాతీయ గీతమైన అమర్ సోనార్ బంగ్లాను కూడా బెంగాల్ విభజనను నిరసిస్తూ 1905లో ఠాగూరే రచించారు.
ఐదు పరుగుల తేడాతో విజయం
బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ విక్టరీతో టీమిండియా సెమీస్ బెర్త్ ను దాదాపుగా ఖాయం చేసుకుంది.ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆ తరువాత లక్ష్యచేధనలో బంగ్లా మొదట్లో చెలరేగినప్పటికీ.. వర్షం పడిన తరువాత తడబడింది. టీమిండియా బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయారు.