- ధర రూ. 750 లోపే..
- ప్రకటించిన ఆర్డీఐఎఫ్
కరోనా ట్రీట్మెంట్ కోసం తమ దేశం డెవలప్ చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను ఇండియాలో ఏటా 85 కోట్లపైగా తయారు చేస్తామని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) ప్రకటించింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి మోడీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. రష్యాతోపాటు ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్తో కలసి చేసిన క్లినికల్ ట్రయల్స్ డేటాను పరిశీలించిన తరువాత డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) పర్మిషన్లు ఇచ్చిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మందికి తమ వ్యాక్సిన్ వేయడానికి అనుమతులు ఉన్నాయని రష్యా సావరిన్ ఫండ్ ప్రకటించింది. మనదేశంలో ఇది వరకే భారత్ బయోటెక్ కోవాగ్జిక్, ఆక్సఫర్డ్–ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు పర్మిషన్లు ఉన్నాయి. స్పుత్నిక్ వ్యాక్సిన్ మూడోది. అయితే ఇతర వ్యాక్సిన్ల వల్ల కొన్ని అలెర్జీలు వస్తాయని, తమ స్పుత్నిక్తో అలాంటి ఇబ్బందులేవీ రావని ఆర్టీఐఎఫ్ తెలిపింది. ఇండియాలో ఒక డోసును 10 డాలర్ల (దాదాపు రూ.750) కంటే తక్కువకే అమ్ముతారని తెలిపింది. రెండు డోసులు వేసుకుంటే కరోనా రాకుండా కాపాడుకోవచ్చు. ఇండియాతోపాటు అర్జెంటీనా, బొలీవియా, హంగరీ, యూఏఈ, ఇరాన్, మెక్సికో, పాకిస్తాన్, శ్రీలంక వంటి 60 తదితర దేశాలు స్పుత్నిక్కు పర్మిషన్లు ఇచ్చాయి.
ఎఫికసీ 91.6 శాతం..
స్పుత్నిక్ను -2 డిగ్రీల నుంచి -8 డిగ్రీల టెంపరేచర్తో నిల్వ చేయాలి. వ్యాక్సిన్ ఎఫికసీ 91.6 శాతం ఉంటుందని మెడికల్ జర్నల్ లాన్సెట్ ఇది వరకే ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ను రష్యా బయట అత్యధికంగా తయారు చేస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ఇండియాలో వ్యాక్సిన్ తయారీకి ఆర్డీఐఎఫ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహా పలు ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. డాక్టర్ రెడ్డీస్తోపాటు హెటెరో, గ్లాండ్ ఫార్మా, స్టెలిస్ ఫార్మా, విక్రో బయోటెక్లు కూడా వ్యాక్సిన్ తయారీ కోసం ఆర్డీఐఎఫ్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే డాక్టర్ రెడ్డీస్ వ్యాక్సిన్లను మొదట రష్యా నుంచి దిగుమతి చేసి అమ్ముతుందని తెలిసింది. తర్వాత అన్ని కంపెనీలూ మనదేశంలోనే స్పుత్నిక్ వ్యాక్సిన్ను తయారు చేస్తాయి కాబట్టి వ్యాక్సిన్ ధర తగ్గుతుందని హెల్త్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ను రెండు డోసుల్లో ఇస్తారు. మొదటి డోసు తీసుకున్న 21 రోజుల తరువాత రెండోది ఇస్తారు. 28 నుంచి 42 రోజుల మధ్య ఇమ్యూనిటీ భారీగా పెరుగుతుందని డాక్టర్ రెడ్డీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వివరించారు.