
- పహల్గామ్ దాడికి కారణమైన టీఆర్ఎఫ్ను ఓ దేశం వెనుకేసుకొచ్చింది
- ఆ దేశాన్ని మరో దేశం సమర్థించేందుకు ప్రయత్నించింది
- నామ్ మీటింగ్లో పరోక్షంగా పాక్, చైనాపై భారత్ ఫైర్
కంపాలా: ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని, దాన్ని కలిసికట్టుగా అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాన్ అలైన్డ్ మూవ్మెంట్ (నామ్ –అలీన ఉద్యమం) సదస్సులో భారత్ పిలుపునిచ్చింది. టెర్రరిజానికి మద్దతిచ్చేవాళ్లు, దాన్ని ప్రోత్సహించేవాళ్లు, ఆ టెర్రరిజం చేతుల్లోనే దెబ్బతింటారని హెచ్చరించింది. క్లైమెట్ చేంజ్, ఆర్థిక వృద్ధి, టెక్నాలజీ, ట్రేడ్, టారిఫ్ సహా అన్ని అంశాల్లో ఉమ్మడిగా ముందుకు సాగుదామని నామ్ సభ్య దేశాలకు సూచించింది.
ఉగాండాలోని కంపాలాలో జరుగుతున్న నామ్ 19వ నామ్ మిడ్టర్మ్ మినిస్టీరియల్ మీటింగ్లో భారత్ తరఫున విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్సింగ్ మాట్లాడారు. దశాబ్దాలుగా భారత్ బార్డర్ టెర్రరిజాన్ని ఎదుర్కొంటున్నదని, ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారని ఆయన అన్నారు.
ఉగ్రవాదులకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారికి భారత్ తగిన గుణపాఠం చెప్పిందని పేర్కొన్నారు. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి ఘటన యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో చర్చకు వచ్చినప్పుడు ఓ సభ్య దేశం.. దాడికి పాల్పడ్డ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) అనే ఉగ్రవాద సంస్థను రక్షించేందుకు ప్రయత్నించింది.. మరో దేశం ఆ దేశాన్ని సమర్థించేందుకు ప్రయత్నించింది” అని పరోక్షంగా పాకిస్తాన్, చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘‘ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవాళ్లను, దాన్ని దాచి పెట్టాలనుకునే వాళ్లను.. ఆ ఉగ్రవాదమే కాటేస్తుంది. టెర్రరిజాన్ని అంతమొందించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఐక్యంగా ముందుకు సాగాలి. ఉగ్రవాదాన్ని అంతం చేసే ఉద్యమంలో నామ్లోని ప్రతి సభ్య దేశం కలిసి ముందుకు సాగాలి. సవాళ్లను గుర్తించి ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి. భారత్ ఎప్పుడూ ప్రపంచ శాంతిని కోరుకుంటుంది” అని తెలిపారు.
భారతదేశం నామ్ సూత్రాలకు, విలువలకు కట్టుబడి ఉందని.. భాగస్వామ్య దేశాలతో కలిసి ముందుకు సాగుతున్నదని ఆయన తెలిపారు. ప్రస్తుతం నామ్లో 120 సభ్యదేశాలు ఉన్నాయి. మరో 18 అబ్జర్వ్ కంట్రీస్, 10 అబ్జర్వ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి.
పాలస్తీనా సమస్యకు ప్రత్యేక దేశమే పరిష్కారం
పాలస్తీనా సమస్యకు ప్రత్యేక దేశమే ఆచరణీయ మార్గమని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. స్వయం నిర్ణయాధికారం, స్వాత్రంత్యం కోసం పాలస్తీనా ప్రజలు చేస్తున్న పోరాటానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్పష్టం చేశారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని, శాంతి నెలకొనాలని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.