చక్కెర వ్యాపారులకు షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2026 సెప్టెంబర్ వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇది చక్కెర ప్రియులకు శుభవార్తే అయినప్పటికీ వ్యాపారులకు మాత్రం షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
డొమెస్టిక్ మార్కెట్ లో చక్కెర ధరలు పెరగకుండా చూసేందుకు, ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. రిఫైన్డ్ షుగర్, తెల్ల చక్కెర, ముడి చక్కెర ఎగుమతులపై తక్షణమే నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం.
చక్కెర ఎగుమతులపై 2026 సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది కేంద్రం. దేశీయ అవసరాలకు సరిపడా చక్కెర నిల్వలను అందుబాటులో ఉంచడం కోసమే ఈ నిర్ణయం వెనక అసలు ఉద్దేశమని తెలుస్తోంది. గత సంవత్సరం ఎల్నినో కారణంగా దిగుబడి తగ్గడం, ఈ ఏడాది కూడా ఋతుపవనాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించిన క్రమంలో అప్రమత్తమైన కేంద్రం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రధాన రాష్ట్రాల్లో చెరకు దిగుబడులు తగ్గడంతో ఈ ఏడాది కూడా ఉత్పత్తి తక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది.
