IND vs AUS: శభాష్ అనిపించుకున్న రాహుల్.. 27 ఏళ్ల చరిత్రలో తొలి విజయం

IND vs AUS: శభాష్ అనిపించుకున్న రాహుల్.. 27 ఏళ్ల చరిత్రలో తొలి విజయం

ప్రత్యర్థి ఎవరైనా స్వదేశంలో మ్యాచ్ అంటే టీమిండియాకు తిరుగుండదు. సొంతగడ్డపై భారత్ తో మ్యాచ్ అంటే ఎంత బలమైన జట్టయినా ఒత్తిడిలోకి వెళ్ళిపోతుంది. కానీ మొహాలీ మైదానం మాత్రం భారత్ కి పీడకలలా మారింది. ఈ గ్రౌండ్ లో టీమిండియాకు ఎక్కువగా పరాజయాలే పలకరించాయి. ఇక ఆస్ట్రేలియా మీద మ్యాచ్ అంటే ఈ మైదానంలో ఓడిపోవడం ఆనవాయితీగా పెట్టుకుంది. ఐదు, పది కాదు 27 ఏళ్లుగా కంగారూల జట్టు మొహాలీలో మన జట్టును కంగారు పెట్టిస్తూనే ఉన్నారు. తాజాగా నిన్న తొలి వన్డేలో విజయంతో 27 ఏళ్ళ ఓటములకు బ్రేక్ వేసింది.

27 ఏళ్ళ తర్వాత ఆసీస్ పై ప్రతీకారం 

మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో 1996 తర్వాత ఆస్ట్రేలియాపై మొహాలీ గడ్డపై తొలి విజయాన్ని అందుకుంది. ఈ మైదానంలో భారత్ ఆస్ట్రేలియాతో ఆడిన చివరి నాలుగు వన్డేల్లో ఓటమిపాలైంది. 1996 టైటాన్స్ కప్ విజయం తర్వాత వరుసగా 2006,2009,2013,2019 సంవత్సరాల్లో టీమిండియా ఓడింది. 2019 లో 358 పరుగుల భారీ స్కోర్ చేసినా.. ఆసీస్ అద్భుత ఆటకు ఓటమి తప్పలేదు.

ALSO READ : జూన్ 11న జరిగిన గ్రూప్ 1 పరీక్ష రద్దు : హైకోర్టు సంచలన తీర్పు

ఆస్ట్రేలియాతో తొలి మ్యాచులో మొహాలీ వేదిక కావడంతో ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. పైగా స్టార్ ప్లేయర్లు లేకుండా బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో పటిష్టమైన ఆసీస్ పై గెలుపు కష్టమనుకున్నారు. కానీ ఆసీస్ కి ఏ మాత్రం అవకాశమివ్వకుండా సునాయాస విజయం సాధించింది. టీమిండియా విజయంలో షమీ 5 వికెట్లతో రాణించగా..278 పరుగుల ఛేజింగ్ లో గిల్(74),గైక్వాడ్(71),రాహుల్ (58),సూర్య (50) అర్ధ సెంచరీలు చేసి టీమిండియాను గెలిపించారు. 

శభాష్ అనిపించుకున్న రాహుల్

ఎందరో కెప్టెన్లకు సాధ్యం కానీ ఘనతను రాహుల్ అందుకున్నాడు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన రాహుల్.. పాకిస్థాన్ పై అద్భుత సెంచరీతో గ్రాండ్ గా తన పునరాగమనాన్ని చాటుకున్నాడు. ఆసియా కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ కి కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడంతో రాహుల్ కి కెప్టెన్సీ అవకాశం దక్కింది. వచ్చిన అవకాశానికి న్యాయం చేస్తూ కెప్టెన్ గా, బ్యాటర్ గా సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలో ఆసీస్ పై మొహాలీ వన్డేలో భారత్ కి విజయాన్ని దక్కించి  శభాష్ అనిపించుకున్నాడు.