కకామిగహరా (జపాన్): అండర్–18 ఆసియా కప్ హాకీ టోర్నీలో ఇండియా కుర్రాళ్లు అదరగొట్టారు. శుక్రవారం జరిగిన సెమీస్లో 5–3తో పాకిస్తాన్ను చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇండియా తరఫున ఆశిష్ తాని పుర్తి (12, 49, 53, 56వ ని), షారూక్ అలీ (35వ ని) గోల్స్ చేయగా, అబిద్ (27వ ని), మహ్మద్ ఫర్హాన్ (37వ ని), ఉజైర్ అహ్మద్ ఖురేషి (42వ ని) పాక్కు గోల్స్ అందించారు.
మ్యాచ్ ఆరంభంలో ఇరుజట్లు మిడ్ఫీల్డ్పై పట్టు కోసం ప్రయత్నించడంతో ఆట కాస్త నిదానంగా సాగింది. అయితే ఇండియా ఫార్వర్డ్స్ అవకాశం వచ్చినప్పుడల్లా పాక్ డిఫెన్స్ ఛేదించారు. ఈ క్రమంలో 12వ నిమిషంలో తొలి గోల్ నమోదైంది. దీని నుంచి తేరుకున్న పాక్ రెండో క్వార్టర్లో దూకుడుగా ఆడింది. ఫలితంగా మరో గోల్ సాధించి స్కోరును 1–1తో సమం చేసింది.
మూడో క్వార్టర్ మొత్తం పాకిస్తాన్ జోరు కొనసాగింది. ఇండియా ఒక్క గోల్ చేస్తే పాక్ రెండు గోల్స్ కొట్టి 3–2 ఆధిక్యంలో నిలిచింది. చివరి క్వార్టర్లో టీమిండియా సర్వశక్తులు ఒడ్డింది. వరుసగా పెనాల్టీ కార్నర్లు సాధించింది. వీటిని ఆశిష్ సూపర్బ్గా గోల్ పోస్ట్లోకి పంపడంతో ఇండియా తిరుగులేని విజయాన్ని అందుకుంది.
విమెన్స్ సెమీస్లో ఇండియా పెనాల్టీ షూటౌట్ (1–3) తో చైనా చేతిలో ఓడింది. ఫలితంగా గోల్డ్ మెడల్ రేసుకు దూరమైంది. నిర్ణీత టైమ్లో ఇరుజట్లు 2–2తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
ఇండియా తరఫున నౌషీన్ నాజ్ (3వ ని), కిరణ్ ఎక్కా (54వ ని) గోల్స్ చేయగా, లీ జెయాన్ (24వ ని), జాంగ్ యుజెంగ్ (48వ ని) చైనాకు గోల్స్ అందించారు. స్టార్టింగ్లోనే ఇండియాకు ఆధిక్యం లభించినా.. ఆట మధ్యలో డిఫెన్స్ వైఫల్యంతో ఓటమిపాలైంది.
