టీ20ల్లో టీమిండియా సరికొత్త చరిత్ర.. పాక్‌ను వెనక్కి నెట్టి టాప్‪లోకి

టీ20ల్లో టీమిండియా సరికొత్త చరిత్ర.. పాక్‌ను వెనక్కి నెట్టి టాప్‪లోకి

ఆస్ట్రేలియాతో 5 టీ 20 ల సిరీస్ లో భాగంగా  మన కుర్రాళ్ళు కుమ్మేసారు. కంగారులపై సంపూర్ణ ఆధిపత్యం చూపిస్తూ 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్నారు. రాయపూర్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో 20 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ తో పాటు టీ 20 ఫార్మాట్ లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా పాకిస్థాన్ ను వెనక్కి నెట్టి అగ్రస్ధానంలోకి దూసుకెళ్లింది.
 
టీ20 చరిత్రలో పాక్ ఇప్పటివరకు 226 మ్యాచ్ ల్లో135 విజయాలను సొంతం చేసుకుంది. భారత్ జట్టు మాత్రం 213 మ్యాచ్ ల్లోనే 136 విజయాలను అందుకోవడం విశేషం. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో పాక్ రికార్డ్ ను సమ చేసిన భారత్ ఆ తర్వాత మూడో టీ 20 లో ఓడిపోయింది. ఇక నిన్న జరిగిన నాలుగో టీ 20లో ఘన విజయాన్ని అందుకొని అత్యధిక విజయాలతో టాప్ లో నిలిచింది. ఈ లిస్టులో 102 విజయాలతో న్యూజిలాండ్, 95 విజయాలతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వరుసగా మూడు, నాలుగు,ఐదు స్థానాల్లో నిలిచాయి.

మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.    యువ బ్యాటర్లు రింకూ సింగ్ (29 బంతుల్లో 46 పరుగులు), జితేష్ శర్మ(35; 19 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ లు ఆడారు. యశస్వి జైస్వాల్(37; 28 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌), రుతురాజ్ గైక్వాడ్(32; 28 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించారు. లక్ష్య ఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ వేడ్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.