కరోనా థర్డ్ వేవ్ అయిపోయింది అనుకునే లోపే కొత్త వేరియెంట్ వచ్చింది. లండన్లో మొదటగా గుర్తించిన ఈ వైరస్ మన దేశానికి కూడా వచ్చేసింది. పేరు ఎక్స్ఇ వేరియెంట్. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్స్ఇ వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఈ వైరస్ ఒమిక్రాన్ లాంటిదేనా? పిల్లల మీద ఎఫెక్ట్ చూపుతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి చాలామందికి.
ఈ కొత్త రకం వైరస్ ఒమిక్రాన్లోని బిఎ1, బిఎ2 అనే రెండు రకాలతో ఏర్పడింది. ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాపిస్తుంది. ఎక్కువమందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది కూడా. మామూలు కరోనా వైరస్తో పోల్చితే ఇది 10 శాతం ఎక్కువ వేగంగా వ్యాపిస్తుంది. కరోనా వైరస్ల జీన్స్లో ఆర్ఎన్ఎ(రైబోన్యూక్లియిక్ యాసిడ్) ఉంటుంది. అందుకనే ఇవి చాలా తొందరగా రూపం మార్చుకుంటాయి అని చెప్తున్నారు డాక్టర్లు.
ఒమిక్రాన్ లాగానే...
‘‘ఇప్పటివరకైతే ఎక్స్ఇ వైరస్ ఇన్ఫెక్షన్కి గురైన వాళ్లలో ఒమిక్రాన్ లక్షణాలే కనిపించాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి గుర్తించారు. ఎక్స్ఇ వేరియెంట్ ఇన్ఫెక్షన్లో కొత్త లక్షణాలు ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు” అంటోంది ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ చారు దత్త అరోరా.
వ్యాక్సిన్తో సేఫ్
పిల్లలు తప్ప దాదాపు అందరూ కరోనా రెండు వ్యాక్సిన్లు వేసుకున్నారు. కరోనా కేసులు తగ్గడంతో మందిలో ఉన్నా కూడా మాస్క్ పెట్టుకోవట్లేదు చాలామంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇస్తే, కరోనా ఇన్ఫెక్షన్ రాకుండా చూడొచ్చు అంటున్నారు డాక్టర్లు.