న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో దేశంలోని టాప్ ఐదు ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా నికరంగా 17 మందికే ఉద్యోగాలు ఇచ్చాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇచ్చిన 17,764 మందితో పోలిస్తే నియామకాలు భారీగా పడిపోయాయి. ఏఐ వాడకం పెరగడమే ఇందుకు కారణం. టీసీఎస్ గత తొమ్మిది నెలల్లో 25,816 మందిని తీసేసింది. ఇదే టైమ్లో ఇన్ఫోసిస్ 13,456 మందిని, విప్రో 9,740 మందిని, హెచ్సీఎల్ టెక్ 1,885 మందిని, టెక్ మహీంద్రా 752 మందిని నియమించుకున్నాయి. టీసీఎస్ ఎక్కువ మందిని తొలగించడంతో నెట్గా ఈ ఐదు కంపెనీలు నియమించిన ఉద్యోగుల సంఖ్య భారీగా పడిపోయింది. ఈ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్లో నికరంగా 2,174 మందిని తొలగించాయి. టీసీఎస్ 11,151 మందిని తొలగించగా, ఇన్ఫోసిస్ 5,043 మందిని, విప్రో 6,529 మందిని నియమించుకున్నాయి. టీసీఎస్ ఈ సంవత్సరం క్యాంపస్ నియామకాల సంఖ్యను వెల్లడించలేదు. దీనినిబట్టి కంపెనీ ఫ్రెషర్ నియామకాలను తగ్గించుకున్నట్టు తెలుస్తోంది.
