న్యూఢిల్లీ: జాతీయ యుద్ధ వీరుల స్మారకాన్ని (నేషనల్ వార్ మెమోరియల్) ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం భరత జాతికి అంకితం చేశారు. అమర వీరులకు జ్యోతిని వెలిగించి ఆయన నివాళి అర్పించారు. ఆ తర్వాత హెలికాప్టర్లలో నుంచి పూల వర్షం కురిపించి అమర వీరులకు నివాళి అర్పించింది ఆర్మీ.
- స్వాతంత్ర్యం తర్వాత పలు యుద్ధాల్లో అమరులైన వారికి గుర్తుగా నిర్మించిన తొలి స్మారకం ఇది.
- న్యూఢిల్లీలోని ఇండియా గేట్ కాంప్లెక్స్ వద్ద 40 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. రూ.176 కోట్లతో నిర్మాణం చేపట్టారు.
- ఈ మెమోరియల్ కాంప్లెక్స్ ను చక్ర వ్యూహం రూపంలో నిర్మించారు. దీని మధ్య భాగంలో అమర జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు.
- చక్ర వ్యూహంలో నాలుగు చక్రాలను అమర్చారు. వాటికి అమర చక్రం, వీర చక్రం, త్యాగ చక్రం, రక్షక చక్రం అని పేర్లు పెట్టారు. వాటి మధ్యలో అమర వీరులకు గుర్తుగా ఆరు కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు.
- 1947, 1965, 1971ల్లో భారత్ – పాక్ మధ్య జరిగిన యుద్ధాలలో, 1962లో జరిగిన ఇండో చైనా వార్, 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లతో పాటు శ్రీలంకలో శాంతి స్థాపనకు వెళ్లి ప్రాణ త్యాగం చేసిన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ సైనికులకు నివాళిగా ఈ మెమోరియల్ ఏర్పాటు చేశారు.
- మెమోరియల్ కాంప్లెక్స్ లోని 16 గోడలపై ఆ యుద్ధాల్లో అమరులైన 25,942 మంది వీర జవాన్ల పేర్లు, ర్యాంకు, రెజిమెంట్ వివరాలను చెక్కారు.
- మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని అమరులైన భారత జవాన్లకు స్మృతి చిహ్నంగా నిర్మించిన ఇండియా గేట్ పక్కనే నేషనల్ వార్ మెమోరియల్ ను మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
- దేశంలో ఇన్నాళ్లుగా యుద్ధాల్లో అమరులైన వీర జవాన్లకు ఒక స్మారకం లేకపోవడం బాధాకరమని మోడీ అన్నారు.