
- రాణించిన రోహిత్, యశస్వి
- వెస్టిండీస్తో రెండో టెస్ట్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : వెస్టిండీస్తో గురువారం మొదలైన రెండో టెస్ట్లో ఇండియాకు మంచి ఆరంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (143 బాల్స్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 80), యంగ్స్టర్ యశస్వి జైస్వాల్ (74 బాల్స్లో 9 ఫోర్లు, 1 సిక్స్తో 57) నిలకడగా ఆడటంతో.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా తొలి రోజు టీ బ్రేక్వరకు తొలి ఇన్నింగ్స్లో 50.4 ఓవర్లలో 182/4 స్కోరు చేసింది. కోహ్లీ (18 బ్యాటింగ్) క్రీజులో ఉండగా, రహానె (8) ఔటయ్యాడు.
ఓపెనర్ల జోరు..
తొలి టెస్ట్కు వేదికైన డొమినికా పిచ్కు భిన్నంగా రూపొందించిన క్వీన్ పార్క్ ఓవల్ వికెట్పై కూడా ఇండియన్ ఓపెనర్లు పూర్తిగా ఆధిపత్యం చూపెట్టారు. పిచ్పై గడ్డి లేకపోవడంతో బౌలర్లు ఎక్స్ట్రా బౌన్స్ను రాబట్టలేకపోయారు. కేవలం స్పీడ్కే పరిమితం కావడంతో వికెట్లు తీసే చాన్సెస్ కూడా రాలేదు. తేమను సద్వినియోగం చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఫీల్డింగ్ తీసుకున్న విండీస్ కెప్టెన్ బ్రాత్ వైట్కు తొలి సెషన్ మొత్తం నిరాశే ఎదురైంది. ఫోర్త్ స్టంప్ను లక్ష్యంగా చేసుకుని బాల్స్ వేయడంలో పేసర్లు రోచ్, అల్జారీ జోసెఫ్ పూర్తిగా ఫెయిలయ్యారు. దీంతో వికెట్ల కోసం ఎక్కువగా షార్ట్ బాల్స్ను ప్రయోగించడంతో వాటిని రోహిత్, యశస్వి బలంగా తిప్పికొట్టారు. ఆరో ఓవర్లో యశస్వి బ్యాట్ తాకి గల్లీలో లేచిన బాల్ను అందుకోలేకపోయారు.
తొలి గంటలో ఎక్కువగా బ్యాటింగ్ చేసిన రోహిత్ ఈజీగా రన్స్ సాధించాడు. గాబ్రియోల్ బౌలింగ్లో చూడముచ్చటైన కవర్ డ్రైవ్స్, ఫుల్ షాట్స్తో అదరగొట్టాడు. ఈ క్రమంలో 19వ ఓవర్లో హిట్మ్యాన్ అద్భుతమైన ఫుల్ షాట్ సిక్స్తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కొద్దిసేపటికే జోసెఫ్ బాల్ను కవర్డ్రైవ్లోకి పంపి యశస్వి కూడా ఫిఫ్టీ మార్క్ను అందుకున్నాడు. తొలి సెషన్లో స్పిన్నర్ వారికాన్ ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. సెషన్ లాస్ట్ ఓవర్కు ముందు హోల్డర్ బౌలింగ్లో జైస్వాల్ ఇచ్చిన క్యాచ్ను ఫస్ట్ స్లిప్లో అలిక్ అథనాజే డ్రాప్ చేశాడు. ఓవరాల్గా ఇండియా 121/0తో లంచ్కు వెళ్లింది.
అయితే రెండో సెషన్ ఆరో ఓవర్లో ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. హోల్డర్ ఆఫ్సైడ్ వైడ్ లెంగ్త్ బాల్కు పేలవ షాట్ కొట్టిన జైస్వాల్ సెకండ్ స్లిప్లో మెకంజీ చేతికి చిక్కాడు. దీంతో ఇండియా 139 రన్స్ వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శుభ్మన్ గిల్ (10) మరోసారి నిరాశపర్చాడు. చకచకా రెండు ఫోర్లు కొట్టి జోరుమీదున్న అతన్ని రోచ్ లెంగ్త్ ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ బాల్తో పెవిలియన్కు పంపాడు. సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్ మరో మూడు ఓవర్ల తర్వాత ఔట్ కావడంతో ఇండియా 155/3తో నిలిచింది.
ఇండియా, వెస్టిండీస్ మధ్య ఇది వందో టెస్ట్ మ్యాచ్ కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మకు జ్ఞాపికను బహుకరిస్తున్న క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ప్రెసిడెంట్ డాక్టర్ కిశోర్ షాలో, లెజెండ్ ప్లేయర్ బ్రియాన్ లారా
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ హిస్టరీలో 2 వేల రన్స్ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. 25 మ్యాచ్ల్లో 2017 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ (1942) రెండో ప్లేస్లో ఉన్నాడు.