
- డీల్పై ఇరు దేశాలు రాజీపడడం లేదు
- ట్రంప్ టారిఫ్ పాలసీలు చట్ట విరుద్ధమని తీర్పిచ్చిన అక్కడి కోర్టులు..
- మరికొంత కాలం వేచి చూశాక నిర్ణయం తీసుకోవాలని చూస్తున్న ఇండియా!
- పాకిస్తాన్, ఇండియా మధ్య అణు యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలతో అమెరికాతో పెరిగిన దూరం
న్యూఢిల్లీ: ఇండియా, అమెరికా మధ్య వచ్చే నెల 9 లోపు తాత్కాలికంగానైనా ట్రేడ్ డీల్ కుదురుతుందనే అందరూ అనుకున్నారు. కానీ, తాజా పరిస్థితులను చూస్తే ఇది జరిగేటట్టు కనిపించడం లేదు. రాజకీయ, ఆర్థిక పరమైన సమస్యలు నెలకొనడమే ఇందుకు కారణమని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ చర్చలు తాత్కాలికంగా ఆగిపోయాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. అమెరికా నుంచి మొక్కజొన్న, సోయాబీన్ లాంటి వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ సుంకంతో దిగుమతి చేయాలని ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. కానీ ఇండియా మాత్రం దీనిని వ్యతిరేకిస్తోంది. ఇలాంటి దిగుమతులు భారత రైతులకు నష్టం కలిగించడంతో పాటు, జన్యుమార్పిడి (జీఎం) పంటల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని భారత అధికారులు చెప్పారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, రెండు దేశాలూ రాజీకి రాలేకపోయాయి. దీంతో చర్చలు స్తంభించాయి. చర్చల్లో అడ్డంకులు నెలకొన్నాయి. జూన్ 5–-6న అమెరికా ట్రేడ్ ప్రతినిధుల బృందం ఢిల్లీలో భారత అధికారులతో సమావేశమైంది. జులై 9 గడువు లోపు ఒక తాత్కాలిక ట్రేడ్ ఒప్పందం కుదురుతుందని ముందు ఆశించారు. కానీ ఇప్పుడు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన 90 రోజుల టారిఫ్ పాజ్ ముగిసేలోపు ఒప్పందం కుదరకపోతే, అమెరికాకు జరిగే భారత ఎగుమతులపై 26శాతం టారిఫ్ పడే ఛాన్స్ ఉంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అందిస్తున్న 10 శాతం బేస్లైన్ టారిఫ్ కూడా ఇండియాకు నచ్చలేదు.
ఆపరేషన్ సిందూర్ వివాదం..
ట్రేడ్ చర్చలకు అదనంగా పొలిటికల్ టెన్షన్స్ కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి. పాకిస్తాన్, ఇండియా మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. దీనిపై భారత్లో అసంతృప్తి నెలకొంది. జూన్ 17 ఫోన్ కాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వాదనను తోసిపుచ్చారు. ఆపరేషన్ సిందూర్ ఆపివేత పాకిస్తాన్ అభ్యర్థన మేరకు, డైరెక్ట్ మిలిటరీ కమ్యూనికేషన్ ద్వారా జరిగిందని, అమెరికా ట్రేడ్ మధ్యవర్తిత్వం లేదా మూడో పక్షం జోక్యం లేదని స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా “ఇలాంటి విషయాల్లో భారత్ ఎప్పుడూ మూడో పక్ష మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోదు” అని చెప్పింది. అయినప్పటికీ, ట్రంప్ పాత పాటే పాడుతున్నారు. పాకిస్తాన్, ఇండియా మధ్య అణుయుద్ధాన్ని ఆపినందుకు తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని కూడా తనకు తాను రికమండ్ చేసుకుంటున్నారు.
ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ ఆలస్యం కావడంలో ట్రంప్ వైఖరి కూడా ఒక కారణం. ట్రంప్ తీసుకున్న టారిఫ్ పాలసీలను అక్కడి కోర్టులు చట్ట విరుద్ధమని తీర్పిచ్చాయి. దీనిపై ఒక క్లారిటీ వచ్చాక ట్రేడ్ డీల్పై నిర్ణయం తీసుకోవాలని ఇండియా చూస్తోంది. మరోవైపు చైనాపై వేసిన టారిఫ్లను ట్రంప్ ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో యూఎస్ టారిఫ్ పాలసీలను ఇండియా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని కూడా ఎనలిస్టులు భావిస్తున్నారు. ఇరు దేశాలు ట్రేడ్ డీల్లో రాజీ పడడం లేదు. దీంతో జులై 9 దగ్గరపడుతున్నా, ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కాగా, అమెరికా, ఇండియా మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
డీల్ నుంచి ఇండియా కోరుతున్నవి..
ఇరు దేశాల మధ్య ట్రేడ్ చర్చలు మొదలైనప్పుడు టెక్స్టైల్స్, లెదర్, ఫార్మా, ఇంజనీరింగ్ గూడ్స్, ఆటో పార్ట్స్ లాంటి సెక్టార్లకు జీరో డ్యూటీ యాక్సెస్ ఇవ్వాలని భారత్ కోరింది. కానీ, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టారిఫ్లను జీరోకి తగ్గించలేమని తేల్చేసింది. ఒప్పందం తర్వాత భవిష్యత్తులో టారిఫ్ పెంపు నుంచి రక్షణ కావాలని కూడా ఇండియా కోరుతోంది. అమెరికా నుంచి ఇంకా స్పష్టమైన హామీ రాలేదు.