న్యూఢిల్లీ: ఇండియా ఆతిథ్యం ఇచ్చే వరల్డ్ కప్ షెడ్యూల్లో మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్తాన్ బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఒక రోజు ముందుగానే జరగనుంది. గత నెలలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ను అక్టోబర్ 15న అహ్మదాబాద్లోని వరల్డ్ లార్జెస్ట్ స్టేడియంలో ప్లాన్ చేశారు. అయితే, అదే రోజు నవరాత్రుల ప్రారంభ రోజు అవనుంది. ఉత్తరాదిలో ముఖ్యంగా గుజరాత్లో ఆ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాంతో, లక్ష పైచిలుకు అభిమానులు వచ్చే మ్యాచ్కు భద్రత కల్పించడం కష్టమని లోకల్ పోలీసులు బీసీసీఐకి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని బోర్డు ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. మ్యాచ్ షెడ్యూల్ను మార్చే విషయంపై బీసీసీఐ పెద్దలు గురువారం ఢిల్లీలో వరల్డ్ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే స్టేట్ అసోసియేషన్లతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, వరల్డ్కప్ ఏర్పాట్లపైనా సమీక్షించనున్నారు.
ఫ్యాన్స్కు తిప్పలే
ఇండో–పాక్ మ్యాచ్ను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ఫ్యాన్స్ ఎంతో ఖర్చు పెట్టి ఫ్లైట్ టికెట్స్, అహ్మదాబాద్లో హోటల్స్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు షెడ్యూల్ మారితే ట్రావెల్ ఫ్లాన్స్ను మార్చుకోవడం ఫ్యాన్స్కు భారం కానుంది. ఇక, ఈ మ్యాచ్ను ముందుకు జరిపి అక్టోబర్ 14న నిర్వహిస్తే టోర్నీ ఓవరాల్ షెడ్యూల్లోనూ మార్పులు జరిగే చాన్సుంది. అక్టోబర్ 14న రెండు మ్యాచ్లు ఉన్నాయి. ఢిల్లీలో ఇంగ్లండ్–అఫ్గాన్, బెంగళూరులో న్యూజిలాండ్–బంగ్లాదేశ్ తలపడతాయి.