- ఇండియా రికార్డు పంచ్
- ఏషియన్ బాక్సింగ్లో 15 మెడల్స్ ఖాయం
- సెమీస్లో అమిత్, వికాస్
దుబాయ్: ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్స్లో డిఫెండింగ్ చాంప్ అమిత్ పంగల్ (52కేజీ), వికాస్ క్రిషన్ (69 కేజీ), తొలిసారి బరిలో నిలిచిన వరీందర్ సింగ్ (60 కేజీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. దాంతో, ఈ మెగా టోర్నీలో ప్రతి కేటగిరీలో ఒకటి చొప్పున ఇండియాకు 15 మెడల్స్ ఖాయం అయ్యాయి. 2019లో ఇండియా అత్యధికంగా 13 మెడల్స్ సాధించగా... ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయనుంది. బుధవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ బౌట్లో అమిత్ 3–2తో మంగోలియాకు చెందిన ఖర్ఖు ఎన్కమందఖ్పై విజయం సాధించాడు. ఫస్ట్ రౌండ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన టాప్ సీడ్ ఇండియన్ బాక్సర్ సెకండ్ రౌండ్ నుంచి చెలరేగిపోయాడు. టోర్నీలో వరుసగా మూడోసారి మెడల్ ఖాయం చేసుకున్న అతను సెమీస్లో కజకిస్తాన్కు చెందిన సాకెన్ బిబోసినొవ్తో పోటీ పడతాడు. 2019 వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్లో సాకెన్ను అమిత్ ఓడించాడు. ఇక 60 కేజీ క్వార్టర్స్లో వరీందర్ 5–0తో జెరె సామ్యూల్ (ఫిలిప్పీన్స్)ను చిత్తు చేశాడు. కౌంటర్ అటాక్స్ మెప్పించిన నేషనల్ చాంప్ వరీందర్ ఏషియన్ ఈవెంట్లో తన తొలి ప్రయత్నంలో మెడల్ను ఖాయం చేసుకున్నాడు. మరోవైపు వికాస్ 4–1తో మోస్లెమ్ మలామిర్ (ఇరాన్)ను ఓడించాడు. 91 కేజీ క్వార్టర్స్లో 5–0తో జసుర్ కుర్బొనోవ్ (తజికిస్తాన్)ను చిత్తు చేసి సెమీస్ చేరాడు. విమెన్స్ కేటగిరీలో సాక్షి (54కేజీ), జాస్మిన్ (57కేజీ), సిమ్రన్జిత్ కౌర్ (60కేజీ) కూడా సెమీస్లో అడుగుపెట్టారు. సాక్షి 5–0తో రుహఫ్జో (తజికిస్తాన్)ను, జాస్మిన్ 4–1తో యెసుగెన్ (మంగోలియా)ను ఓడించారు. ఈ మధ్యే కరోనా నుంచి కోలుకున్న టోక్యో ఒలింపిక్స్ బాక్సర్ సిమ్రన్ 4–1తో ఉజ్బెకిస్తాన్కు చెందిన రైఖోనా కొడిరోవాపై గెలిచింది. గురువారం జరిగే సెమీఫైనల్స్లో మేరీకోమ్ సహా పది మంది ఇండియా విమెన్ బాక్సర్లు తమ సెమీస్ బౌట్లలో పోటీ పడతారు.