బ్రిస్బేన్: ఆస్ట్రేలియా టూర్ను టీమిండియా టీ20 సిరీస్ విజయంతో ఘనంగా ముగించింది. భారీ వర్షం వల్ల శనివారం ఇరుజట్ల మధ్య జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ రద్దు అయ్యింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇండియా 2–1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా 4.5 ఓవర్లలో 52/0 స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (13 బాల్స్లో 1 ఫోర్, 1 సిక్స్తో 23 నాటౌట్), శుభ్మన్ గిల్ (16 బాల్స్లో 6 ఫోర్లతో 29 నాటౌట్) దుమ్మురేపారు.
ఈ దశలో మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో వెలుతురు తగ్గిపోయింది. కొద్దిసేపటికే భారీ వర్షం పడటంతో గ్రౌండ్ను కవర్లతో కప్పించారు. వర్షం ఎంతకూ ఆగకపోవడంతో చివరకు అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన అభిషేక్ ఆసీస్ బౌలింగ్ను ఉతికేశాడు. అయితే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
డ్వార్షుయిస్ వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్ ఇచ్చిన క్యాచ్ను మ్యాక్స్వెల్ డ్రాప్ చేశాడు. ఇక 11 రన్స్ వ్యక్తిగత స్కోరు వద్ద, నాలుగో ఓవర్లో ఇచ్చిన క్యాచ్ను డ్వార్షుయిస్ వదిలేశాడు. మూడు బాల్స్ తర్వాత అభిషేక్ మిడ్ వికెట్ మీదుగా పవర్ఫుల్ ఫ్లాట్ సిక్స్ కొట్టి ఫ్యాన్స్కు ఉత్సాహం కలిగించాడు. రెండో ఎండ్లో గిల్.. డ్వార్షుయిస్ను లక్ష్యంగా చేసుకున్నాడు. అతను వేసిన మూడో ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. ఈ ఇద్దరు క్రీజులో బలంగా పాతుకుపోయినా.. వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడం ఫ్యాన్స్ను కాస్త నిరాశకు గురి చేసింది. ఈ సిరీస్లో 163 రన్స్ చేసిన అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.
* ఇంటర్నేషనల్ టీ20ల్లో అతి తక్కువ బాల్స్లో వెయ్యి రన్స్ పూర్తి చేసిన తొలి బ్యాటర్ అభిషేక్ శర్మ (528 బాల్స్). సూర్యకుమార్ (573) రెండో ప్లేస్లో ఉన్నాడు.
* తక్కువ ఇన్నింగ్స్ల్లో వెయ్యి రన్స్ పూర్తి చేసిన రెండో బ్యాటర్ అభిషేక్ శర్మ (28 ఇన్నింగ్స్). విరాట్ కోహ్లీ (27 ఇన్నింగ్స్) ముందున్నాడు.
